ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు... ఆ మూడు పిటిషన్లు డిస్మిస్
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:43 PM
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వైసీపీ నేత దాఖలు చేసిన మూడు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.
అమరావతి, మార్చి 30: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు కేసును బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత పిటిషన్ వేశారు. అలాగే ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశారు.
ఈ పిటిషన్లంటిపై హైకోర్టులో విచారణ జరిగింది. దాదాపు మూడు వారాల పాటు విచారణ జరిగిన అనంతం ఈరోజు(సోమవారం) ఉదయం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే వ్యాజ్యాల విచారణార్హతపై కూడా ఇటీవల న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇలాంటి పిటిషన్లకు విచారణార్హత లేదని సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు.. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదంటూ వేర్వేరుగా దాఖలు చేసిన మూడు పిటిషన్లను డిస్మిస్ చేసింది.
ఇవి కూడా చదవండి..
కరువు మండలాల విద్యార్థులకు డ్రై రేషన్
నరసరావుపేట ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరి మృతి
Read Latest AP News And Telugu News