ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ABN , Publish Date - Mar 30 , 2026 | 10:40 AM
ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రవాణ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, ఓవర్ లోడ్తో నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అమరావతి, మార్చి 30: ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రవాణ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా.. ఓవర్ లోడ్తో నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలు, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 976 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న, నిబంధనలు ఉల్లంఘించిన 193 బస్సులపై కేసులు నమోదు చేసి, భారీగా జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రధాన పాయింట్లలో ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది బస్సు యజమానులు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులను తరలిస్తూ.. అధిక లోడ్తో బస్సులను నడుపుతున్నారని చెప్పారు. భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలను పాటించాలని చెప్పారు. ప్రయాణికుల క్షేమమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్... డీఎంకే మేనిఫెస్టో
వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ