అన్నీ నా భర్తకే తెలుసు! నాకేం తెలియదు..
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:03 AM
‘‘వీసా స్కామ్ గురించి నాకేమీ తెలియదు.. డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాలన్నీ నా భర్త మధుకర్ చూసుకుంటారు. మమ్మల్ని సంప్రదించిన వారి వీసాలు సమయానికి వెళ్లకపోవడం వల్లే రద్దయ్యాయి తప్ప.. అందులో మా తప్పేమీ లేదు’’ అని ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ నందన పోలీసులకు వివరణ ఇచ్చారు.
కావాలనే మాపై దుష్ప్రచారం
విచారణలో యూట్యూబర్ నందన
ఇబ్రహీంపట్నంలో విచారణకు హాజరు
16న మళ్లీ రావాలని నోటీసులు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘వీసా స్కామ్ గురించి నాకేమీ తెలియదు.. డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాలన్నీ నా భర్త మధుకర్ చూసుకుంటారు. మమ్మల్ని సంప్రదించిన వారి వీసాలు సమయానికి వెళ్లకపోవడం వల్లే రద్దయ్యాయి తప్ప.. అందులో మా తప్పేమీ లేదు’’ అని ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ నందన పోలీసులకు వివరణ ఇచ్చారు. వీసాలు ఎందుకు రద్దయ్యాయో పేర్కొంటూ వచ్చిన ఎస్ఎంఎస్లు చూపించి.. కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. యూకేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కేసులో హైదరాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం నోటీసులు అందుకున్న ఆమె మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. నలుగురు లాయర్ల సమక్షంలో ఆమెను సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు నాలుగు గంటల పాటు విచారణ చేశారు. మొత్తం 30 నుంచి 40 ప్రశ్నలు అడగగా.. ఆమె కొన్నింటికి మాత్రమే సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు నందనతోపాటు ఆమె భర్త మధుకర్, మామ మోహన్రావులను ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే.. తమ పిల్లలను స్కూల్కు పంపాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు లండన్లో ఉండాలని, ఇద్దరం ఒకేసారి విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని ఆమె వివరించారు. కాగా, విచారణ అనంతరం బయటకు వస్తున్న నందనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘మొత్తం మీరే చేశారు..’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అద్దంకి నుంచి వచ్చిన ఓ పెద్దాయన శ్రీనివాసరావు మీ మీద చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి..’ అని మీడియా ప్రశ్నించగా... ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా, తన విషయం తేల్చకుండా ఆమెను అలా వదిలేస్తే ఎలా... అని శ్రీనివాసరావు వాపోయాడు.
ఈ వార్తలనూ చదవండి...
బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..