Share News

గొడ్డలి పార్టీ పాలనలో టూరిజం రంగం నిర్వీర్యం: ఏపీటీడీసీ చైర్మన్

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:35 PM

బీచ్ షాక్స్ వద్ద పర్యాటకులకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. రాష్ట్రంలోని 20 బీచ్‌లకు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని అన్నారు.

గొడ్డలి పార్టీ పాలనలో టూరిజం రంగం నిర్వీర్యం: ఏపీటీడీసీ చైర్మన్
APTDC Chairman Nukasani Balaji

అమరావతి, జూన్ 23: పర్యాటక ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఏపీ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ విధానాలతో పర్యాటక రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల గొడ్డలి పార్టీ పాలనలో టూరిజం రంగం నిర్వీర్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదికను కూల్చేసి విధ్వంస పాలనకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.


రోజుకు రూ.2 లక్షల ఆదాయం తెచ్చే రుషి కొండ పర్యాటక కేంద్రాన్ని ధ్వంసం చేశారని నూకసాని బాలాజీ చెప్పారు. రూ.500 కోట్లతో సొంత విలాసాల కోసం రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. టూరిజంలో ఒక్క ఉద్యోగం కూడా గొడ్డలి పార్టీ హయంలో కల్పించలేదని అన్నారు. నేడు 1.22 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామని వివరించారు.


కేంద్రం తోడ్పాటుతో రూ.441 కోట్లు వెచ్చించి సూర్యలంక, గండికోట, అన్నవరం, సింహాచలం, బొర్రా గుహలు, అఖండ గోదావరి వంటి ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నామని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్ పేర్కొన్నారు. బీచ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా బీచ్ షాక్స్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పర్యాటకుల ఆకాంక్షలకు అనుగుణంగా గోవా తరహాలో బీచ్ షాక్స్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు.


బీచ్ షాక్స్ వద్ద పర్యాటకులకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 బీచ్‌లకు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధి సాధించేలా ప్రణాళికలు రచించామని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య.. కుమార్తెతోపాటు ఆమె ప్రియుడే నిందితులు..!

పీఎంజే బంగారం షాపు దోపిడీ.. మరో ఇద్దరు దొంగలు అరెస్ట్

For More AP News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 02:05 PM