జులై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ పునః ప్రారంభం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:36 PM
దివ్యాంగుల కోసం పింఛన్కు సంబంధించిన వైకల్య ధ్రువపత్రాల (సదరం) జారీ సేవల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. జులై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ పునః ప్రారంభం అవుతుందని తెలిపారు.
అమరావతి, జులై 05: దివ్యాంగుల కోసం పింఛన్కు సంబంధించిన వైకల్య ధ్రువపత్రాల (సదరం) జారీ సేవల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. జులై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ పునః ప్రారంభం అవుతుందని ప్రకటించారు. జులై 13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇకపై జోనల్ విధానంలోనే సదరం స్లాట్ బుకింగ్ ఉంటుందని వివరించారు. రాష్ట్రాన్ని 6 జోన్లుగా ప్రభుత్వం విభజించిందని చెప్పారు.
సొంత జోన్లోని జిల్లాల్లోనే స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని దివ్యాంగులకు కల్పించామని మంత్రి సత్యకుమార్ వివరించారు. తద్వారా సుదూర జిల్లాలకు వెళ్లాల్సిన ఇబ్బందులకు చెక్ పెట్టినట్లు అయిందన్నారు. స్లాట్ బుకింగ్కు స్వీయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని మంత్రి సత్యకుమార్ చెప్పారు. వైకల్య కేటగిరీపై స్పష్టత లేకపోతే డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. తప్పుడు స్లాట్ బుకింగ్లకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుందని తెలిపారు. హాజరు నమోదు అనంతరమే వైకల్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
సదరం పోర్టల్లో ఆన్లైన్ హాజరు నమోదు తప్పనిసరి అని వివరించారు. హాజరు నమోదుతోనే సదరం ఐడీ యాక్టివేషన్ అవుతుందని పేర్కొన్నారు. సదరం సేవల్లో పారదర్శకత పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏపీ సేవా పోర్టల్ ద్వారా నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. సిటిజన్ లాగిన్తో ఉచితంగా అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకోవచ్చునని చెప్పారు. సదరం ధ్రువీకరణ పత్రాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించామని అన్నారు.
సచివాలయాల ద్వారా కూడా సదరం సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 'మన మిత్ర' వాట్సాప్ సేవలో స్లాట్ లభ్యత వివరాలు పొందుపరిచామని చెప్పారు. సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. దళారులకు ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు అధికారులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ప్రయాణ భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వైద్యులపై పనిభారం తగ్గించేలా ఈ కొత్త విధానం ఉంటుందని తెలిపారు. ఈ సదరంపై అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ముంబైలో మరో దారుణం.. వీడియో వైరల్..
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి తుమ్మల
For More AP News And Telugu News