రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:54 PM
వ్యవసాయంలో సాంకేతిక విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ యాప్కు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు.
హైదరాబాద్, జులై 05: వ్యవసాయంలో సాంకేతిక విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ యాప్కు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు. యాప్తో యూరియా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిరోజూ జిల్లాల వారీగా యూరియా బులెటిన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఇప్పటి వరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని గణాంకాలతో సహా మంత్రి వివరించారు. 17.70 లక్షల మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకున్నారని గుర్తు చేశారు. 59.78 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసుకుంటే.. 52.86 లక్షల బ్యాగుల కొనుగోలు పూర్తయ్యాయని చెప్పారు. భూమి ఆధారిత యూరియా పంపిణీతో నిజమైన రైతుకే ఎరువు అందుజేస్తామని ఆయన పేర్కొన్నారు.
బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని.. అలాగే నిఘాను కూడా పెంచామని మంత్రి తుమ్మల తెలిపారు. శాటిలైట్ ఆధారిత మట్టి పరీక్షలపై ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయంలో ఏఐ, ఉపగ్రహ సాంకేతికత వినియోగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యవసాయ సాంకేతికతపై జర్మనీలో అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు.