Share News

బడ్జెట్ సమావేశాలు ప్రారంభ వేళ.. స్పీకర్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Feb 10 , 2026 | 08:06 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

బడ్జెట్ సమావేశాలు ప్రారంభ వేళ.. స్పీకర్ కీలక నిర్ణయం
AP Assembly Speaker Ayyanna Patrudu

అమరావతి, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల అటెండెన్స్‌కు సంబంధించి.. రిజిస్ట్రర్లు ఉండవని స్పష్టం చేశారు. వారి హాజరను డిజిటల్ విధానంలోనే తీసుకుంటామని తెలిపారు. అంటే.. అసెంబ్లీలో ఇకపై ఎలక్ట్రానిక్ అటెండెన్స్ అమల్లోకి రానుందన్నారు. అలాగే అసెంబ్లీలో శాసనసభ్యుడు.. తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదవుతుందన్నారు.


ఫేషియల్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) ద్వారా మాత్రమే హాజరు నమోదు కానుందని స్పీకర్ స్పష్టం చేశారు. సభలో సభ్యులు తమ సీటులో కూర్చున్న తరువాత వారి ఫేస్‌ను కెమెరాలు క్యాప్చర్ చేస్తాయన్నారు. ఈ తరహా అటెండెన్స్ కోసం అసెంబ్లీలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

ఎమ్మెల్యే కెమెరాకు ముఖం చూపించి వెళ్లినా.. హాజరు నమోదు కాదని అసెంబ్లీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సభ్యుడు తప్పనిసరిగా తనకు కేటాయించిన సీటులో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు వారు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ బులెటిన్ విడుదల చేశారు.


మరోవైపు గతంలో మాదిరిగా అసెంబ్లీలో సభ్యులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తే కుదరదని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో వైసీపీ సభ్యులు రిజిస్టర్‌లో సంతకాలు చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆదేశాల మేరకు బులెటిన్ విడుదల చేస్తున్నట్లు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఇక బుధవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ నో సిట్టింగ్ డే అంటూ అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో అసెంబ్లీ స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు సమావేశమయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలంటూ గవర్నర్‌ను సభాపతి ఆహ్వానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు థ్యాంక్స్

నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంక్‌.. సుజనా చౌదరి రియాక్షన్

For More AP News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 08:54 PM