ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు: నారాయణ
ABN , Publish Date - Aug 19 , 2026 | 02:46 PM
ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్నికల్లో నేరు ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని అన్నారు.
అమరావతి, ఆగస్టు19: ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్నికల్లో నేరు ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం మేయర్, మున్సిపల్ చైర్మన్పై ఉండదని స్పష్టం చేశారు. వీరిద్దరు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
అలాగే సుదీర్ఘ అభివృద్ది ప్రణాళికలు అమలుపరిచే అవకాశం ఉంటుందని అన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ది పనులు వేగవంతం చేయవచ్చునని చెప్పారు. పెట్టుబడిదారులు, పరిశ్రమలు, పర్యాటక రంగాన్ని మేయర్, చైర్మన్ యాక్టివ్గా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు.. వీరిద్దరిపై రాజకీయ ప్రభావం తగ్గుతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకూ అవసరమైన పనులు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
అంతకుముందు అసెంబ్లీలో పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మున్సిపల్ పరపాలన శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన చట్ట సవరణ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరగనుంది. ఇప్పటి వరకూ వీరిద్దరిని పరోక్ష పద్దతిలో ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫొటో జర్నలిస్ట్గా మారిన సీఎం చంద్రబాబు
అసెంబ్లీకి రాకుండా డీఎస్సీపై విమర్శలా.. వైసీపీపై సీఎం చంద్రబాబు ధ్వజం
For More AP News And Telugu News