అమరావతి భూ సేకరణపై మరో పిల్ ఎందుకు?: హైకోర్టు
ABN , Publish Date - Jul 22 , 2026 | 08:07 PM
అమరావతి భూ సేకరణపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భూ సేకరణపై అభ్యంతరం ఉన్న రైతులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినప్పుడు మరో పిల్ ఎందుకని ప్రశ్నించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ సేకరణకు సంబంధించిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. భూ సేకరణపై అభ్యంతరాలు ఉన్న బాధిత రైతులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినప్పుడు, మరో పిల్ ఎందుకని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. నోరులేని రైతుల తరఫున పిల్ దాఖలు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. భూ సేకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సింది బాధిత రైతులేనని, పిటిషనర్కు ఈ వ్యవహారంతో ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించింది.
నిడమర్రు గ్రామానికి చెందిన జంగా నాగిరెడ్డి దాఖలు చేసిన ఈ పిల్పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, కోర్టు రాజకీయ వేదిక కాదని, కోర్టు అధికారిగా నిజాయతీగా విచారణలో కోర్టుకు సహకరించండని సీనియర్ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. వాక్చాతుర్యాన్ని పక్కన పెట్టి వాస్తవాలు, చట్టపరమైన అంశాలపై దృష్టి సారించాలని స్పష్టం చేసింది. పిటిషన్ విచారణార్హతపై పూర్తి స్థాయిలో వాదనలు వినిపించాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read:
కౌంటీ ఛాంపియన్షిప్: యార్క్షైర్తో కుల్దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి