అమరావతి అసెంబ్లీకి సరికొత్త డిజైన్: మంత్రి మనోహర్
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:40 PM
అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ భవనానికి కొత్త డిజైన్ రూపొందిస్తున్నామని చెప్పారు.
అమరావతి: ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ భవనాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నామని చెప్పారు.
అసెంబ్లీ భవనం పైభాగంలో టవర్ ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి మొత్తం రాజధాని ప్రాంతాన్ని వీక్షించేలా నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్లో జరిగే నియోజకవర్గాల డీలిమిటేషన్ను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ భవన డిజైన్లపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. 265 అసెంబ్లీ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా భవన నిర్మాణ డిజైన్ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
సందర్శకులకు ప్రత్యేక అనుభూతి
అసెంబ్లీని సందర్శించే ప్రజలకు మంచి అనుభూతి కలిగేలా ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో అసెంబ్లీ, శాసనమండలి సభ్యులు ఒకే చోట కూర్చునేలా సెంట్రల్ హాల్ ఏర్పాటు చేయడానికి అనువుగా డిజైన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ పచ్చదనం ఉండేలా, ఒక గార్డెన్లా కనిపించే విధంగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు మంత్రి తెలిపారు. మంత్రులు, విప్లు, కమిటీ చైర్మన్లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అసెంబ్లీ డిజైన్ను రూపొందిస్తున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు.
Also Read:
ఇతరులకు నీతులు చెప్పే ముందు చరిత్ర చూసుకోవాలి జగన్: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఉద్యోగానికి రాజీనామా చేసి.. బెజవాడ బయలుదేరిన భావన.. అంతలో..