Share News

గలగలా గోదారి!

ABN , Publish Date - Sep 03 , 2026 | 03:48 AM

గోదారమ్మ, కృష్ణమ్మ సహా రాష్ట్రంలోని నదులన్నిటినీ అనుసంధానించి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పవిత్ర లక్ష్యాన్ని సాధించి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తామని చెప్పారు. అందులో భాగంగానే నిన్న కృష్ణమ్మను తరలించి (వెలిగొండ) కరువు పీడిత మార్కాపురం ప్రాంతానికి నీళ్లిచ్చామని..

గలగలా గోదారి!

  • ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల

  • పాయకరావుపేటలో నీరు వదిలిన సీఎం

  • హారతిపట్టి సాష్టాంగ నమస్కారం

  • గోదావరి, కృష్ణా సహా రాష్ట్రంలోని

  • నదులన్నీ అనుసంధానిస్తాం

  • తెలుగుతల్లికి జలహారతి ఇస్తాం

  • నిన్న కృష్ణమ్మను మల్లన్న పాదాల నుంచి చెన్నకేశవుడి చెంతకు తీసుకెళ్లాం

  • ఇప్పుడు సత్యదేవుడి ఆశీస్సులతో గోదారమ్మను అనకాపల్లి తీసుకొచ్చాం

  • వచ్చే ఏడాదికి అప్పన్న పాదాల చెంతకు

  • ఆపై అరసవల్లి సూర్యనారాయణుడి వద్దకు తీసుకెళ్లి వంశధారతో అనుసంధానిస్తాం

  • జలం ఉంటే జీవం, జీవితం.. సాగు, బాగు

  • ఎడమ కాలువకు 4,192 కోట్లు ఖర్చు

  • 4 లక్షల ఎకరాలకు సాగునీరు..

  • 9 లక్షల మందికి తాగునీరు

  • విశాఖ పరిశ్రమలకు 23 టీఎంసీలిస్తాం

  • ఈ కాలువను మరింత విస్తరిస్తాం

  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంధానిస్తాం

  • మరో రూ.3,200 కోట్లతో 12 ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

  • ఉత్తరాంధ్ర.. ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర: సీఎం

నీటి విలువ నాకు బాగా తెలుసు. జలం ఉంటే జీవం, జీవితం ఉంటాయి. నీరు ఉంటేనే సాగు, బాగు. గంగమ్మ ఉంటే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుంది. నీరు ఉంటేనే భద్రత.. భవిష్యత్‌ కూడా. పోలవరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్క వెనుక.. ఇంజనీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, నిర్వాసితుల త్యాగం, ప్రభుత్వ సమర్థత, రైతుల నిరీక్షణ ఉన్నాయి.విస్తృత అవకాశాలు, పరిశ్రమలతో రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లడం కాకుండా ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర అవుతుంది. - సీఎం చంద్రబాబు


పాయకరావుపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గోదారమ్మ, కృష్ణమ్మ సహా రాష్ట్రంలోని నదులన్నిటినీ అనుసంధానించి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పవిత్ర లక్ష్యాన్ని సాధించి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తామని చెప్పారు. అందులో భాగంగానే నిన్న కృష్ణమ్మను తరలించి (వెలిగొండ) కరువు పీడిత మార్కాపురం ప్రాంతానికి నీళ్లిచ్చామని.. ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని తెచ్చామని చెప్పారు. బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం గ్రామంలోని క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ఆయన విడుదల చేశారు. అనంతరం పూజలు చేసి, జలహారతి ఇచ్చారు. గోదారమ్మకు సాష్టాంగ ప్రణామం చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర గీతంలో శంకరంబాడి సుందరాచారి చెప్పినట్లు.. ‘గల గలా గోదారి కదిలిపోతుంటేను.. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను.. బంగారు పంటలే పండుతాయి’ అనే పాటను నిజం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలని నమ్ముతానన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని గడిచిన ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, మిత్రుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి తాను ప్రజల వద్దకు వచ్చానని.. మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించారని.. ఆ దీవెన ఫలితంగానే నేడు అనకాపల్లికి గోదారమ్మ వచ్చిందని చెప్పారు. ‘ఉత్తరాంధ్ర గడపలో అడుగుపెట్టిన గోదావరికి ప్రణమిల్లుతున్నాం. మీరంతా కూడా నమస్కరించి స్వాగతం పలకాలి’ అని సీఎం భావోద్వేగంతో ప్రజలకు పిలుపిచ్చారు.

నిన్న వెలిగొండ ప్రాజెక్టుతో కృష్ణమ్మను కరువు పీడిత మార్కాపురం ప్రాంతానికి తీసుకెళ్లామన్నారు. శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి మార్కాపురం చెన్నకేశవుడి చెంతకు కృష్ణమ్మ దిశ మార్చుకుని నల్లమల కొండలను చీల్చుకుని వచ్చిందని తెలిపారు. గోదావరి నది మూడు పాయలై (గౌతమి, వశిష్ఠ, వైనతేయ) సముద్రంలో సంగమిస్తుంటే.. ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి తరలివచ్చిందన్నారు. తాను హెలికాప్టర్‌లో వస్తూ చూశానని, అద్భుతమైన పనితీరుకు నిదర్శనంగా కాలువలు కనిపిస్తున్నాయని తెలిపారు. తూర్పు కనుమలు, అడవులు, వాగులు, నదులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో గోదావరి ఇక్కడకు వచ్చిందన్నారు. ఇక్కడి నుంచి వచ్చే ఏడాదికి సింహాద్రి అప్పన్న చెంతకు తీసుకెళ్తామని.. భవిష్యత్‌లో అరసవిల్లి సూర్యనారాయణుడి వద్దకు తరలించి వంశధారకు అనుసంధానిస్తామని స్పష్టంచేశారు. కృష్ణా గోదావరి నదులను ఉపయోగించుకుని ప్రజలకు మంచి చేయాలన్నదే తన జీవితాశయమన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


డెడ్‌లైన్లు.. సవాళ్లు..

గోదావరి నీళ్లు సులభంగా ఈ ప్రాంతానికి రాలేదు. అనే క సవాళ్లు అధిగమించి ఇక్కడ వరకు నీటిని తరలించుకుని వచ్చాం. ఏలేరు సైఫన్‌, పంపా నది, తాండవ, వరహ నదులపై అక్విడెక్ట్‌లు ఏర్పాటు చేసుకుంటూ.. కొండ ప్రాంతాల్లో వందల మీటర్లు తవ్వుకుంటూ కొన్నిచోట్ల ఫ్లైఓవర్లు కట్టుకుంటూ నది పైనుంచి నది ప్రవహించేలా చేసుకుంటూ తీసుకొచ్చాం. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో భూవివాదా న్ని, కుమ్మరిలోవ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాం. సరిగా పనిచేయకపోతే వదిలిపెట్టనని, జైల్లో కూడా పెడతానని హెచ్చరించి కాంట్రాక్టర్లతో పని చేయించాను. ఎంతో శ్రమ పడడం వల్ల ఫలితం వచ్చింది. ఎడమ కాలువ నిర్మాణానికి ఇప్పటివరకూ రూ.4,192 కోట్లు ఖర్చు చేశాం. 2014-19తోపాటు ఈ రెండేళ్ల కాలంలో రూ.2,382 కోట్లు వ్యయమయ్యాయి. మరో రూ.800 కోట్లు ఖర్చు చేస్తాం. మొత్తం రూ.3,200 కోట్లు నేను సీఎంగా ఉండగా వ్యయం చేసినట్లవుతుంది. ఎడమ కాలువ ద్వారా వస్తున్న గోదావరి జలాలతో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇం దులో తూర్పు గోదావరి జిల్లాలో 81 వేల ఎకరాలు, కాకినా డ జిల్లాలో 1.6 లక్షల ఎకరాలు, కోనసీమ జిల్లాలో 2,300 ఎకరాలకు, అనకాపల్లి జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు నీరు ఇస్తాం. మరో 9 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. విశాఖ పరిశ్రమలకు 23 టీఎంసీలు అందిస్తాం.

ఎడమ కాలువను విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తాం. మరో రూ.3,200 కోట్లు ఖర్చు చేసి 2028 నాటికి ఉత్తరాంధ్రలోని ఈ 12 ప్రాజెక్టులను పూర్తిచేసి జాతికి అంకితమిస్తా. ఒకసారి చెప్పాక ఆరునూరైనా చేసి తీరతా. మేం పాలకులమే కాదు.. సేవకులం. పదవి అంటే పెత్తనం కాదు.. జవాబుదారీతనం. నాకు అహంకారం లేదు.. అంకిత భావం ఉంది. విశాఖలో టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఆసియా మొ త్తానికి విశాఖ నుంచి సీ కేబుల్‌ కనెక్టివిటీ అవుతుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా విశాఖ మారుతుంది. నేషనల్‌ హైవేలు, 4 వరుసల రైల్వే లైన్లు, పోర్టులు, హార్బర్లతో మధ్య భారతానికి విశాఖను కనెక్ట్‌ చేస్తాం. హైదరాబాద్‌ పక్కనున్న రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ప్రాంతం. రానున్న రోజుల్లో అనకాపల్లి కూడా మరో రంగారెడ్డి అవుతుంది. ఇదే నా విజన్‌. విశాఖపట్నం ఏఐ పట్నంగా తయారవుతోంది. డేటా సెంట ర్ల హబ్‌గా మారుతోంది. నాలెడ్జ్‌ ఎకానమీ ఒకవైపు, పరిశ్రమలు మరోవైపు, వ్యవసాయం ఇంకొక వైపు పరిగెత్తే పరిస్థితి వస్తోంది. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.


గోదారమ్మకు ప్రత్యేక పూజలు, హారతి..

ఉండవల్లి నుంచి పాయకరావుపేట హెలిప్యాడ్‌కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఓపెన్‌ టాప్‌ జీపులో పోలవరం ఎడమ కాలువ వద్దకు చేరుకున్నారు. అనంతరం గోదావరి జలాల విడుదలకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రి నిమ్మల, రైతులు కలిసి నీటిని విడుదల చేయగా.. ముఖ్యమంత్రి కాలువలోకి దిగి కొబ్బరికాయ కొట్టి, గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జలహారతి ఇచ్చారు. గట్టుపైకి వచ్చి గోదారమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. 4.10కి రైతు ఎం.రుత్తయ్యతో కలిసి రెగ్యులేటర్‌ స్విచాన్‌ చేసి గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు విడుదల చేశారు.

ప్రమాణ స్వీకారం చేయనని చెప్పా..

రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై దృష్టిసారించాం. అయితే 7మండలాలు తెలంగాణలో ఉండిపోవడంతో ప్రాజెక్టు ముం దుకు కదిలే పరిస్థితి లేదు. పోలవరం కలగానే మిలిలిపోతుందన్న ఆలోచనతో.. ప్రమాణ స్వీకారానికి ముందు ఆ 7మండలాలూ ఏపీకి ఇవ్వాలని ప్రధానిని కోరాం. అవి ఇస్తే నే సీఎంగా ప్రమాణం చేస్తానని, లేదంటే చేయనని చెప్పా ను. ఆయన కూడా దీనిని సీరియ్‌సగా తీసుకుని ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ తెచ్చి ఆ మండలాలను ఏపీలో కలిపారు. తర్వాత పార్లమెంటుతో ఆమోదింపజేశారు. ఏడు మండలాలను ఏపీలో కలిపేలా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పోలవరం సాకారమయ్యేది కాదు. ఇందుకు సహకరించిన ప్రధానికి మనఃపూర్వక ధన్యవాదాలు.


ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉత్తరాంధ్రకు జలసిరులు!

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పోలవరం కుడి కాల్వ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలవిడుదల దేశవ్యాప్తంగా ఎక్స్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ‘వాటర్‌ టు ఉత్తరాంధ్ర’(ఉత్తరాంధ్రకు జలసిరులు) హ్యాష్‌ ట్యాగ్‌తో గోదావరి జలాల విడుదల అంశం ఇండియా ట్రెండింగ్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది

ఉత్తరాంధ్ర మరచిపోలేని రోజు

‘ఈసారి సెప్టెంబరు రెండో తేదీకి రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు అయితే... రెండోది పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి పరవళ్లు తొక్కడం. నాకు స్పీకర్‌ పదవి ఇవ్వడం వల్ల రాజకీయాలు మాట్లాడలేకపోతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చా. ఈరో జు ఉత్తరాంధ్ర చరిత్రలో ప్రజలంతా మరచిపోలేని రోజు. ఈ ఘనత సీఎం చంద్రబాబుదే.’

- చింతకాయల అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ స్పీకర్‌

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు

‘పోలవరం ప్రాజెక్టును 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అన్ని పార్టీలు మ్యానిఫెస్టోలో పెట్టాయి. అటువంటి పోలవరం సాధన కల నెరవేర్చిన ఘనత ఎన్‌డీఏ ప్రభుత్వానిదే. మరోసారి ఎన్నికల మ్యానిఫెస్టోలో పోలవరం పేరు లేకుండా సీఎం చంద్రబాబు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 14 లక్షల ఎకరాలకు సాగు నీరందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.’ - పీవీఎన్‌ మాధవ్‌, రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ

కలలో కూడా ఊహించలేదు...

‘పోలవరం ప్రాజెక్టు గురించి సుమారు 50 సంవత్సరాల నుంచి వింటున్నాను. నేను బతికుండగా గోదావరి నీరు మా ప్రాంతానికి వస్తుందని అనుకోలేదు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టును పట్టించుకోలేదు. కానీ కలలో కూడా ఊహించని విధంగా సీఎం చంద్రబాబు ఎంతో కృషిచేసి గోదావరి జలాల ను తీసుకొచ్చారు.’

- పోతల విఘ్నేశ్వరుడు, ఒడ్డిమెట్ట, నక్కపల్లి మండలం


మెట్ట ప్రాంతం.. సస్యశ్యామలం

పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి నీటితో మెట్ట ప్రాంతం అయిన మా మండలం సస్యశ్యామలం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల, కృషి వల్లనే గోదావరి జిలాలు మా ప్రాంతానికి వస్తున్నాయి. బాబు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. - బి.లోవరాజు, పీఎల్‌ పురం,

పాయకరావుపేట మండలం దశాబ్దాల కలలను నిజం చేశారు

‘పోలవరం ప్రాజెక్టు ద్వారా మా ప్రాంతానికి గోదావరి నీరు వస్తుందని ఎన్నో దశాబ్దాల నుంచి పాలకులు చెబుతున్నారు. ఇరవై ఏళ్ల క్రితం పనులు మొదలైనప్పటికీ చంద్ర బాబు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ముమ్మరంగా సాగాయి. అనుకున్నట్టుగానే ఆయన చేతుల మీదుగా ఎడమ కాలువ నుంచి మాకు నీరు విడుదల చేశారు. ఇకపై అనకాపల్లి జిల్లాలో సాగు నీటికి ఢోకా ఉండదు.’ - కొలగాని భాస్కరరావు, కృష్ణాపురం, ఎలమంచిలి మండలం

విజన్‌ ఉన్న నేత చంద్రన్న

భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే విజన్‌ ఉన్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తీసుకొచ్చిన ఆయన... భవిష్యత్తులో సాగు, తాగు నీటి కొరత లేకుండా చేశారు. ఇది జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు చేసుకున్న అదృష్టం. - కరణం సత్యప్రసాద్‌, దిమిలి, రాంబిల్లి మండలం

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 03:48 AM