Share News

‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌’ అవార్డుల్లో ఏపీ హవా

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:02 AM

స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ నగరాలు, పట్టణాలు సత్తా చాటాయి. సోమవారం, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026కు గాను ప్రదానం చేసిన ఐదో ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ అవార్డుల్లో.. మిలియన్‌ ప్లస్‌ కేటగిరీ మొదలుకొని చిన్న పట్టణాల వరకు ఏపీలోని 11 నగరాలు, పట్టణాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అవార్డులు కైవసం చేసుకున్నాయి.

‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌’ అవార్డుల్లో ఏపీ హవా

  • 11 నగరాలు, పట్టణాలకు పురస్కారాలు

  • 10 లక్షల జనాభా కేటగిరీలో విజయవాడకు 8 ర్యాంకు

  • విశాఖకు 21వ స్థానం.. హైదరాబాద్‌కు 19

  • రూ.45 లక్షల బహుమతులు అందుకున్న వీఎంసీ

న్యూఢిల్లీ, విజయవాడ (కార్పొరేషన్‌), సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ నగరాలు, పట్టణాలు సత్తా చాటాయి. సోమవారం, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026కు గాను ప్రదానం చేసిన ఐదో ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ అవార్డుల్లో.. మిలియన్‌ ప్లస్‌ కేటగిరీ మొదలుకొని చిన్న పట్టణాల వరకు ఏపీలోని 11 నగరాలు, పట్టణాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అవార్డులు కైవసం చేసుకున్నాయి. జాతీయ స్వచ్ఛ వాయు దివస్‌ సందర్భంగా సోమవారం ఈ అవార్డులను ప్రకటించారు. 10 లక్షలకు పైగా జనాభా కేటగిరీలో 186 స్కోరుతో విజయవాడ 8వ ర్యాంకు, విశాఖపట్నం 172 స్కోరుతో 21వ ర్యాంకు సాధించాయి. ఈ కేటగిరీలో హైదరాబాద్‌ 174.2 స్కోరుతో 19వ ర్యాంకు సాధించింది. ఇక, 3-10 లక్షల జనాభా కేటగిరీలో 195 స్కోరుతో గుంటూరు దేశంలోనే సంయుక్తంగా 2వ ర్యాంకు, 187 స్కోరుతో నెల్లూరు 9వ ర్యాంకు, 180 స్కోరుతో రాజమండ్రి 14వ ర్యాంకు, 162 స్కోరుతో కర్నూలు 29వ ర్యాంకు, 144 స్కోరుతో కడప 34వ ర్యాంకు, 144 స్కోరుతో అనంతరపురం 34వ ర్యాంకు సాధించాయి. 3 లక్షల లోపు జనాభా గల కేటగిరిలో 193 స్కోరుతో ఏలూరు 4వ ర్యాంకు, 189.5 స్కోరుతో విజయనగరం 6వ ర్యాంకు, 185.5 స్కోరుతో శ్రీకాకుళం 11వ ర్యాంకు, 168.5 స్కోరుతో ఒంగోలు 25వ ర్యాంకు, 167.8 స్కోరుతో చిత్తూరు 26వ ర్యాంకు సాధించాయి. అలాగే, జాతీయ స్థాయిలో వార్డుల విభాగంలో 10 వేల నుంచి 30 వేల జనాభా కేటగిరీలో విజయవాడ 60వ వార్డు దేశంలోనే 2వ ర్యాంకు సాధించి జాతీయ అవార్డు దక్కించుకుంది. రాష్ట్ర స్థాయిలో 10 వేల నుంచి 30 వేల జనాభా కేటగిరీ కింద గుంటూరులోని 42వ వార్డు, విజయవాడలోని 31వ వార్డుకు అవార్డులు వరించాయి. 10 వేల లోపు జనాభా కేటగిరిలో నెల్లూరులోని 6వ వార్డు అవార్డు దక్కించుకుంది.


విజయవాడకు డబుల్‌ ధమాకా

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2026 ఫలితాల్లో విజయవాడ నగరానికి రెండు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో విజయవాడలోని 60వ డివిజన్‌ బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌గా ద్వితీయ ర్యాంక్‌ సాధించగా, రాష్ట్రస్థాయిలో 31వ డివిజన్‌ ప్రథమ స్థానంలో నిలిచి బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ అవార్డు దక్కించుకుంది. రెండు అవార్డులతో కలిపి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.45 లక్షల బహుమతులు లభించాయి. జాతీయ స్వచ్ఛ వాయు దివస్‌ సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని పర్యావరణ భవన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, మంత్రి కృతి వర్ధన్‌సింగ్‌, కార్యదర్శి తన్మయ్‌ కుమార్‌ చేతుల మీదుగా మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర ఈ అవార్డులు అందుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి

నియోజకవర్గానికో కోటి!

రాష్ట్ర ఆర్థిక సంఘానికిపటిష్ఠ డేటా వ్యవస్థ


Updated Date - Sep 08 , 2026 | 06:03 AM