బస్సు ఎక్కుతున్నట్లు నటిస్తూ దొంగల చేతివాటం.. 35 తులాల బంగారం చోరీ..
ABN , Publish Date - May 17 , 2026 | 12:29 PM
విశాఖలోని ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇద్దరు మహిళలు చేతివాటం ప్రదర్శించారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం, మే 17: విశాఖలోని ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇద్దరు మహిళలు చేతివాటం ప్రదర్శించారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ఒక మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకున్నారు. బాధితురాలు కాకినాడ వెళ్లే బస్సు ఎక్కుతున్న సమయంలో నిందితులైన ఇద్దరు మహిళలు కూడా ప్రయాణికుల్లా నటిస్తూ ఆమె వెనుక చేరారు. బస్సు ఎక్కే క్రమంలో నెట్టుకుంటూ వెళ్తున్నట్లు నటిస్తూ, అత్యంత చాకచక్యంగా బాధితురాలి బ్యాగు జిప్ తీసి, అందులో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.
నగలు చేతికి చిక్కగానే వారిద్దరూ అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. కొంతసమయం తర్వాత బ్యాగు తెరిచి చూసుకున్న బాధితురాలు.. అందులో నగలు లేకపోవడంతో షాక్కు గురైంది. వెంటనే ఆర్టీసీ కాంప్లెక్స్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి కాంప్లెక్స్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఇద్దరు మహిళలు ప్రయాణికురాలి బ్యాగులోంచి నగలు దొంగిలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పరారీలో ఉన్న మహిళా దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News