శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
ABN , Publish Date - May 17 , 2026 | 05:53 AM
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికి కల్పిస్తున్న తిరుమల శ్రీవారి ప్రత్యేక ‘మెడికల్ దర్శనం’ కోటా పరిధిని..
హైకోర్టులో పిటిషన్
4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని టీటీడీకి ఆదేశం
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికి కల్పిస్తున్న తిరుమల శ్రీవారి ప్రత్యేక ‘మెడికల్ దర్శనం’ కోటా పరిధిని మరికొన్ని అరుదైన వ్యాధులకు విస్తరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. గత డిసెంబరులో పిటిషనర్ సమర్పించిన వినతిపై నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. నిర్ణయాన్ని పిటిషనర్కు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం క్యాన్సర్, కిడ్నీ, కాలేయ మార్పిడి, డయాలసిస్, వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులతో పాటు గుండె, వెన్నెముక, మెదడు శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికి మాత్రమే శ్రీవారి ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తున్నారని, దీని పరిధిని విస్తరించేలా టీటీడీని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది శ్రీకృష్ణ యశస్వి పిటిషన్ దాఖలు చేశారు. ఈ జాబితాలో మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులను చేర్చకపోవడం వల్ల భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడలేక స్వామివారి దర్శనానికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద కేంద్రం గుర్తించిన ఆటో ఇమ్యూన్, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్లు, తలసేమియా, సికిల్సెల్ అనీమియా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారిని కూడా మెడికల్ దర్శనం కోటా పరిధిలోకి తీసుకొచ్చేలా టీటీడీని ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.