Share News

CM Revanth Reddy: తెలంగాణ పరుగు ఆగదు!

ABN , Publish Date - Feb 28 , 2025 | 03:21 AM

తెలంగాణ సత్తా ఏంటో, దానికున్న క్రేజ్‌ ఏంటో గత రెండు దఫాల దావోస్‌ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలతో, తాజాగా ముగిసిన బయోఏషియా సదస్సుతో ప్రపంచానికంతటికీ తెలిసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ పరుగు ఆగదు!

  • రాష్ట్రం క్రేజ్‌ పెట్టుబడులతో తెలిసొచ్చింది

  • అనుమానించిన వాళ్లే అభినందిస్తున్నారు

  • రాష్ట్రాభివృద్ధిని ప్రపంచమే ఒప్పుకుంది

  • హెచ్‌సీఎల్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభంలో సీఎం

  • గోల్ఫ్‌ కోర్స్‌-విల్లా భూముల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం

  • సీఎంను కలిసిన ‘ఎమ్మార్‌’ వ్యవస్థాపకుడు

  • గత అధికారుల కమిటీకి అదనంగా న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం

  • వైఎస్‌ హయాంలో ఎమ్మార్‌ భూకేటాయింపులు

  • ప్రస్తుత విలువ రూ.40 వేల కోట్ల పైనే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సత్తా ఏంటో, దానికున్న క్రేజ్‌ ఏంటో గత రెండు దఫాల దావోస్‌ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలతో, తాజాగా ముగిసిన బయోఏషియా సదస్సుతో ప్రపంచానికంతటికీ తెలిసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ రైజింగ్‌.. తెలంగాణ రైజింగ్‌ అని తాను అన్నప్పుడు మొదట్లో సాధ్యమేనా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులు, ఏర్పాటవుతున్న భారీ పరిశ్రమలు, జరుగుతున్న పరిణామాలతో అందరూ తమ సత్తాను అంగీకరిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని అనుమానించినవాళ్లే నేడు అభినందిస్తున్నారని చెప్పారు. దావోస్‌ సమావేశాల్లో మొదటి దఫా రూ.41 వేల కోట్లు, రెండోసారి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను సాధించామని ప్రస్తావించారు. నిన్ననే ముగిసిన బయోఏషియా అంతర్జాతీయ సదస్సులో దిగ్గజ ఫార్మా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు సానుకూల వాతావరణానికి అద్దం పట్టాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచమంతా ఒప్పుకుంటోందని, ఇక తెలంగాణ పరుగు ఆగదని వ్యాఖ్యానించారు. మాదాపూర్‌లో 3.2 లక్షల చదరపు అడుగుల్లో, 5 వేల ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన హెచ్‌సీఎల్‌ కొత్త క్యాంప్‌సను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు కలిసి గురువారం ప్రారంభించారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం హైదరాబాద్‌, తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్థి చెందుతున్న నగరంగా, రాష్ట్రంగా నిలిచాయని చెప్పారు. ఇప్పుడు మన పోటీ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు నగరాలతో కాదని, ప్రపంచ స్థాయి నగరాలతోనని స్పష్టం చేశారు. రాష్ట్రం అనేక రంగాల్లో సాధించిన పెట్టుబడులే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎలకా్ట్రనిక్‌ వాహనాలను ప్రోత్సహించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ 1గా ఉందని చెప్పారు. రాష్ట్రం డేటా సెంటర్ల హబ్‌గా, గ్రీన్‌ ఎనర్జీ, లైఫ్‌ సైన్సెస్‌, బయోటెక్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, అగ్రి ప్రాసెసింగ్‌ రంగాల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణ అత్యధిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ)ను ముందుగా అందిపుచ్చుకున్నామని ప్రస్తావించారు. తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మార్చుతామని చెప్పినప్పుడు కొందరు సాధ్యం కాదన్నారని, తాము సాధించిన పెట్టుబడులు అది సాధ్యమేనని నిరూపిస్తున్నాయని చెప్పారు. 60 దేశాల్లో డిజిటల్‌, ఇంజనీరింగ్‌, క్లౌడ్‌, ఏఐ రంగాల్లో 2.2 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ దేశ గౌరవాన్ని పెంచిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 2007లో హైదరాబాద్‌లో ప్రారంభమైన హెచ్‌సీఎల్‌.. ఇప్పుడు కొత్త క్యాంపస్‌ ఏర్పాటుతో మరో ఐదువేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు.


సిటీ కంపెనీలకు 15 పేటెంట్లు

నైపుణ్యాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యునివర్సిటీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కూడా భాగస్వామి కావాలని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఆనంద్‌ మహీంద్రా లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలను యునివర్సిటీలో భాగస్వామ్యం చేశామని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పాటులో ఐటీరంగం కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్‌ హబ్‌గా మారిందని, ఇటీవలే నగరానికి చెందిన టెక్‌ కంపెనీలు 15 పేటెంట్లు పొందాయని ప్రస్తావించారు. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి స్విట్జర్లాండ్‌ దిగ్గజ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సి.విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


Also Read:

గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు

ఈ చిట్కా పాటిస్తే.. రూ. 40 వేలు మీ జేబులోకే..

రూ. 108కే రీఛార్జ్ ప్లాన్.. డేటాతోపాటు కాల్స్ కూడా..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 28 , 2025 | 03:21 AM