Share News

Miss World 2025: మిస్‌వరల్డ్‌ పోటీలకు 5వేల మందితో భద్రత

ABN , Publish Date - May 10 , 2025 | 03:44 AM

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌-2025 పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సర్కారు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Miss World 2025: మిస్‌వరల్డ్‌ పోటీలకు 5వేల మందితో భద్రత

  • హోటల్‌ వద్ద సాయుధ మహిళా పోలీసులు..

  • ఆక్టోపస్‌ కమాండోలు.. సీసీ టీవీల నిఘా

  • మల్టీ ఏజెన్సీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

  • మూడంచెల భద్రతా వలయంలో పోటీల నిర్వహణ

  • అనుక్షణం పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు

  • నేటి నుంచే మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు

  • గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుకలు

  • అందాల భామలు.. బిర్యానీ, పలావ్‌లు!

  • పులుసు, వేపుడు అడిగి మరీ తింటున్నారు

  • 100 మంది చెఫ్‌లు.. 500 మంది సహాయకులు

  • ‘మిస్‌ వరల్డ్‌’ చెఫ్‌లతో ‘ఆంధ్రజ్యోతి’ ముచ్చట

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌-2025 పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సర్కారు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు 109 దేశాలకు చెందిన సుందరీమణులు, ప్రతినిధులు రాష్ట్రానికి రావడంతో భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా వ్యవహరిస్తున్నారు. దాదాపు 5వేల మందికి పైగా పోలీసులను ఈ పోటీల నిమిత్తం రంగంలోకి దించారు. వీరిలో అత్యధిక మంది సాయుధ పోలీసులే. పోటీల ప్రారంభ వేడుకలు జరిగే గచ్చిబౌలి స్టేడియంతోపాటు అతిథులు బస చేసి ఉన్న హోటళ్ల వద్ద షార్ప్‌ షూటర్లను, స్నైపర్లను మోహరించారు. ప్రపంచ సుందరి పోటీదారులకు హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని ఓ స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఆ హోటల్‌తోపాటు ఆ ప్రాంతం మొత్తం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశారు. హోటల్‌లో ఉండే సీసీ టీవీలు, ట్రాఫిక్‌ సీసీ కెమెరాలను అన్నింటినీ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇక శనివారం గచ్చిబౌలి స్టేడియంలో పోటీల ప్రారంభ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, క్విక్‌ రియాక్షన్‌ టీ మ్స్‌ను ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లతోపాటు వేదిక వద్ద మోహరిస్తున్నారు. మొత్తం మూడంచెల భద్రతావలయంలో పోటీలు జరుగుతాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

1 copy.jpg


హోటల్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌..

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే పోటీదారులకు బస ఏర్పాటుచేసిన హోటల్‌లోనే పోలీసులు కూడా ‘‘మల్టీ ఏజెన్సీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’’ను ఏర్పాటు చేశారు. ఇందులో సివిల్‌ పోలీస్‌, ట్రాఫిక్‌, అగ్నిమాపక శాఖ, ఫుడ్‌ సేప్టీ, పోలీసు ఐటీ విభాగం సహా పలు విభాగాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని స్ర్కీన్‌లు ఏర్పాటుచేశారు. ఎప్పటికప్పుడు రోడ్లుపై ట్రాఫిక్‌తోపాటు, వేదిక వరకు వెళ్లే మార్గంతోపాటు, హోటల్‌ల్‌ పోటీదారులు ఉండే ఫ్లోర్‌లలోని సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పోలీసు ఐటీ విభాగం కీలకంగా ఉండగా, దాదాపు 40 మంది వివిధ పనుల బాధ్యతలను చూస్తున్నారు. మరోవైపు హోటల్‌తో పాటు గచ్చిబౌలి ప్రాంతంలో డోన్లను వినియోగించేందుకు అవకాశం లేకుండా ‘‘నో డ్రోన్‌’’ జోన్‌గా ప్రకటించారు. హోటల్‌ దగ్గర మహిళా పోలీసులకే డ్యూటీలు వేశారు. హోటల్‌తో పాటు పరిసర ప్రాంతంలో కలిపి దాదాపు 2వేల మంది పోలీసులు డ్యూటీల్లో ఉండనున్నారు. ఆక్టోప్‌సలో రెండు టీమ్‌లను ఏర్పాటుచేశారు. డాగ్‌ స్వ్కాడ్‌ కూడా హోటల్‌ దగ్గర ఉంది. హోటల్‌ దగ్గర బందోబస్తును సైబరాబాద్‌ స్పెషల్‌బ్రాంచ్‌ డీసీపీ సాయిశ్రీ పర్యవేక్షిస్తున్నారు.


మూడంచెల భద్రత..

ప్రపంచంలోని 120 దేశాలకు చెందినవారు మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గోంటున్న నేపథ్యంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత పరిణామాలతో పాకిస్థాన్‌ ఇటువైపు కన్నువేసి ఉండవచ్చనే అనుమానాలు ఇప్పటికే నిఘా వర్గాలను వెంటాడుతున్నాయి. అయినా.. భద్రతా చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్స్‌ను రంగంలో దించారు. అనుమానాస్పద ప్రాంతాలపై కన్నేసి ఉంచారు. గచ్చిబౌలి స్టేడియానికి అతిథులు చేరుకునే వరకు అడుగడుగునా సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. మిస్‌వరల్డ్‌ పోటీదారులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల పోలీసు అధికారులకు డీజీపీ జితేందర్‌ ఇప్పటికే పూర్తిస్థాయి బ్రీఫింగ్‌ ఇచ్చారు. పోటీలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయని, మిస్‌వరల్డ్‌ పోటీదారుల పర్యటనలు యథావిధిగా ఉంటాయని, అతిథుల సంఖ్య మాత్రం పరిమితం కావచ్చని సీనియర్‌ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.


వైభవంగా ప్రారంభ వేడుకల నిర్వహణ

సంస్కృతి, సౌందర్యం మేళవింపుగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌వరల్డ్‌-2025 పోటీలు శనివారం ప్రారంభం కానున్నాయి. పోటీల ప్రారంభ వేడుకలను శనివారం గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర కళారూపాలన్నింటినీ సమ్మిళతం చేసి.. అందాల పోటీల వేదికగా తెలంగాణ ఖ్యాతిని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పనున్నారు. ప్రారంభ వేడుకల సందర్భంగా ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమండూరి రామాచారి 50 మంది శిష్యబృందంతో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు. ఆ తరువాత కాకతీయుల కాలం నుంచి పేరొందిన పేరిణి నాట్య ప్రదర్శన 250 మంది కళాకారిణులతో ఏర్పాటు చేశారు. కళాకారులంతా కలిసి మిస్‌వరల్డ్‌ లోగో ఆకృతిని తమ విన్యాసాల ద్వారా ప్రదర్శించనున్నారు.


పాసుల కోసం 7వేల దరఖాస్తులు

మిస్‌ వరల్డ్‌ పోటీలను చూేసందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు. పోటిల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వాటిని చూేసందుకు పర్యాటక శాఖ ఉచితంగానే కొన్ని పాసులను ఇవ్వనున్నట్టు తెలిపింది. పాసుల కోసం రెండు రోజుల క్రితం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రకటించింది. ఇందులో ఇప్పటివరకు దాదాపు 7వేల మందికి పైగా పాసుల కోసం రిజిరేస్టషన్‌ చేసుకున్నారు. ఇంకా చాలా మంది పాసుల కోసం వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి పాసులు ఇచ్చాక మళ్లీ పది రోజుల్లో సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని పర్యాటక శాఖ పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 03:44 AM