TG DGP Reaction On Chevella Bus Accident: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. స్పందించిన డీజీపీ
ABN , Publish Date - Nov 04 , 2025 | 06:31 PM
రోడ్డుప్రమాదాలు పెద్ద సమస్యగా మారాయంటూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల కారణంగానే మరణిస్తున్నారని గుర్తు చేశారు. రోడ్డు మీద డ్రైవ్ చేసే వారు డిఫెన్స్ కండిషన్ను అంచనా వేసుకొని డ్రైవ్ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 04: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం కేసు దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. టిప్పర్ అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. దాదాపు 40 మీటర్లు టిప్పర్ లాక్కెళ్లడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని వివరించారు. ఘటన సమయంలో ఆర్టీసీ బస్సులో రైట్ సైడ్ కూర్చున్న వారు చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

అయితే, ప్రమాదం జరిగిన చోట రోడ్డు మలుపు ఉందని కానీ.. అది యాక్సిడెంట్ అయ్యేంత తీవ్రంగా లేదన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రోడ్డు ప్రమాదానికి గురైన టిప్పర్ కండిషన్ను మెకానిక్ ద్వారా పరీశీలిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన టిప్పర్ లారీ ఓనర్ లక్ష్మణ్ నాయక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదని.. ఇది అందరి బాధ్యతగా చూడాల్సి ఉందని ఈ సందర్భంగా డీజీపీ అభిప్రాయపడ్డారు. రోడ్డుప్రమాదాలు పెద్ద సమస్యగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల కారణంగానే మరణిస్తున్నారని చెప్పుకొచ్చారు. రోడ్డు మీద డ్రైవ్ చేసే వారు డిఫెన్స్ కండిషన్ను అంచనా వేసుకొని డ్రైవ్ చేయాల్సి ఉందన్నారు.
రోడ్డుప్రమాదాలపై వచ్చే నెల నుంచి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదాన్ని చేవెళ్ల ఏసీపీ విచారణ అధికారిగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలో వెళ్లడిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సీఎంకు పట్టుకున్న ఓటమి భయం: నిరంజన్ రెడ్డి
ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం సంచలన నిర్ణయం
Read Latest Telangana News And Telugu News