Hyderabad: కాంగ్రెస్ మద్దతుదారులదే పై‘చేయి’...
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:39 AM
గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే పై చేయిగా ఉంది. తొలివిడతలో జరిగిన రంగారెడ్డి జిల్లాలో పంచాయతీల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.
- తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు
- గట్టిగానే ఢీ కొట్టిన బీఆర్ఎస్
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్(BRS) కూడా గట్టిగానే పోటీ ఇచ్చింది. అనేక పంచాయతీల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్(Congress-BRS) మద్దతుదారుల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగింది. రంగారెడ్డి జిల్లాలో తొలి విడత 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో ఆరుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 158 సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 174 స్థానాల్లో 91 చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 64 చోట్ల గెలుపొందారు. బీజేపీ నామమాత్రంగానే సర్పంచ్ స్థానాలను గెలుపొందింది. నాలుగు చోట్ల గెలుపొందగా 15 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. నందిగామ మండలంలో బీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఇక్కడ మొత్తం 19 సర్పంచ్ స్థానాలకు గానూ 12 చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, కేవలం 5 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు.

కేశంపేటలో బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు చెరో 14 స్థానాలు వచ్చాయి. చౌదరిగూడలో కాంగ్రెస్ 12 సర్పంచ్స్థానాలు దక్కగా బీఆర్ఎస్ 11 దక్కించుకుంది. శంషాబాద్ మండలం(Shamshabad Mandal)లో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక్కడ మొత్తం 21 సర్పంచ్ స్థానాలకుగానూ అధికార పార్టీ మద్దతుదారులు 12చోట్ల విజయం సాధించారు. 3 చోట్ల బీఆర్ఎస్, రెండు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్ధులు గెలుపొందారు. నాలుగు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
Read Latest Telangana News and National News