Share News

Pushpa-2 movie: శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 07:37 AM

పుష్ప-2 సినిమా విడుదల రోజున జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. అటు శ్వాస తీసుకోలేడు.. అటు అన్నం తినలేక ఈ బాలుడు పడుతున్న బాధ అర్ణనాతీతం. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది కావస్తున్నా.. ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు.

Pushpa-2 movie: శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్‌
Pushpa-2 Issue

- ఒంటినిండా ట్యూబులతో మంచంపై నిశ్చేష్టంగా

- పైపుతో ద్రవాహారం.. ప్రతి రోజూ థెరపీలు

- సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు ఏడాది

- కొడుకు కోసం ఉద్యోగం మానేసి తండ్రి సపర్యలు

- నెలకు రూ.1.50 లక్షల దాకా అవుతున్న ఖర్చు

- రూ.2 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన అల్లు అర్జున్‌

- చికిత్స ఖర్చులకు ఏమాత్రం సరిపోని వడ్డీ డబ్బులు

- శ్రీతేజ్‌ కోలుకునే దాకా అండగా ఉంటామన్నఅల్లు కుటుంబం హామీని గుర్తు చేస్తున్న తండ్రి

హైదరాబాద్‌ సిటీ: పుష్ప-2 సినిమా.. నిర్మాతలకు కాసుల పంట పండించి ఉండొచ్చు. అల్లు అర్జున్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా మరో మెట్టు ఎక్కించి ఉండొచ్చు. కానీ, ఒక కుటుంబానికి మాత్రం జీవిత కాలపు పీడ కలను మిగిల్చింది. రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలవర పెట్టిన ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌ దుర్ఘటన జరిగి బుధవారంతో ఏడాది అవుతోంది. అమ్మ, నాన్న, చెల్లితో కలిసి తన అభిమాన నటుడి సినిమా చూడడానికి వెళ్లిన పదేళ్ల శ్రీతేజ్‌... తొక్కిసలాటలో తల్లిని కోల్పోయాడు. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌.. తన తల్లి ఇక లేదన్న సంగతి కూడా గుర్తించలేని స్థితిలో మంచంమీద నిశ్చేష్టంగా పడి ఉంటున్నాడు.


city2.jpg

ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా.. ఇంకా ఆ కుటుంబం కోలుకోకపోగా మరింత దుఃఖంలో కూరుకుపోయింది. ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ ఆరు నెలల కిందట డిశ్చార్జి అయ్యాడు కానీ, అతని ఇల్లే ఇప్పుడు దవాఖానాగా మారింది. తండ్రే నర్సు అయి నిరంతరం సపర్యలు చేస్తున్నారు. శ్రీతేజ్‌ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్సాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. శ్వాసకూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్‌ పెట్టారు. దీంతో శ్రీతేజ్‌ ఒంటినిండా ట్యూబులతో పొత్తిళ్లలో పసిబిడ్డలా ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉంటున్నాడు.


ప్రతిరోజూ థెరపీలు..

శ్రీతేజ్‌ ఆకలి అని సైగ కూడా చేయలేడు. తొక్కిసలాటలో చిన్నారి మెదడు కణాలు 70 శాతం దెబ్బతినడమే ఇందుకు కారణం. తన చిటికెన వేలు పట్టుకొని నడవాల్సిన బాబును చేతుల్లోకి ఎత్తుకొని మోయాల్సి వస్తోందంటూ శ్రీతేజ్‌ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘రోజూ సికింద్రాబాద్‌లోని ఆసియా ట్రాన్స్‌కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో కొన్ని నెలలుగా బాబుకు స్వాలో(మింగడం), స్పీచ్‌(మాట్లాడటం) థెరపీ ఇప్పిస్తున్నాం. అక్కడే అడ్మిట్‌ చేస్తే నెలకు రూ.90 వేలకు పైగా ఫీజు చెల్లించాలి. బాబును చూసుకోడానికి ఒక మనిషి అక్కడే ఉండాలి. ఇంట్లో 6ఏళ్ల నా కూతురు, 75 ఏళ్ల మా అమ్మ బాగోగులు కూడా నేనే చూసుకోవాలి.


city2.2.jpg

ఇంటి పనులు చక్కబెట్టుకొని.. పాపను స్కూలుకు పంపించిన తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు రోజూ క్యాబ్‌లో బాబును తీసుకొచ్చి థెరపీలు ఇప్పిస్తున్నాను. రోజుకు రూ.2 వేల చొప్పున థెరపీలకే రూ.60వేలకు పైన కడుతున్నాను.

ఇక ఇంటి దగ్గర కూడా కాళ్లు, చేతుల కదలికలకు ఫిజియోథెరపీ చేయిస్తున్నాం. అదీ రూ.30 వేలవరకు అవుతుంది. ప్రతి నెలా కేవలం థెరపీలకే తక్కువలో తక్కువ రూ.90 వేలు కడుతున్నాను. కనీసంగా 2 నుంచి 3 ఏళ్లు నిరంతరం థెరపీలు ఇప్పిస్తే బాబు కోలుకోవచ్చని డాక్టర్లు చెప్పారు’’ అని శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ వివరించారు.


కొడుకు కోసం ఉద్యోగం వదిలేసి...

శ్రీతేజ్‌కు ప్రతి మూడు గంటలకు ఒకసారి గ్యాస్ట్రో స్టోమీ ట్యూబ్‌ ద్వారా ద్రవాహారం అందిస్తుండాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి మెడ దగ్గర అమర్చిన ట్రాకియోస్టోమీ పైపులోని తెమడ వంటి ద్రవాన్ని శుభ్రం చేయాలి. నిరంతరం డైపర్లు మారుస్తుండాలి. నిత్యం వేడినీళ్లతో ఒళ్లు తుడిచి దుస్తులు వేయాలి. ఇవన్నీ చేయాలంటే ఇద్దరు మనుషుల పర్యవేక్షణ అవసరం. ఇదంతా చేయడానికి ఇంటిపట్టున ఉండే శ్రీతేజ్‌ నాయనమ్మకు అసాధ్యం. ‘‘ఇదివరకు బంగారం దుకాణంలో పనిచేసేవాడిని. అదే నా కుటుంబానికి ఆదరువు.


ప్రమాదం తర్వాత మా జీవితం తలకిందులయింది. బాబును చూసుకోడానికి ఇంటిపట్టునే ఉంటున్నాను. మరోపక్క మా అమ్మాయిని కూడా సముదాయించాలి. ఇప్పటికి ఒక్కోరోజు అర్థరాత్రి నిద్రలేచి అమ్మా అని పాప ఏడుస్తుంటుంది’’ అని చెబుతూ భాస్కర్‌ కన్నీటిపర్యంతమయ్యారు. ఏప్రిల్‌లో శ్రీతేజ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా థెరపీలు ఇప్పించడం వల్ల కొంచెం మార్పు కనిపిస్తోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


ప్రమాదం అనంతరం శ్రీతేజ్‌ కాళ్లు పూర్తిగా ముడుచు కుపోవడంతో జూన్‌లో మరొక ప్రైవేటు ఆస్పత్రిలో కాళ్లకు శస్త్రచికిత్స చేయించారు. ‘‘కాళ్లకు ఆపరేషన్‌తో పాటు ఇప్పటివరకు థెరపీలకు రూ.20లక్షలు చెల్లించాం. శ్రీతేజ్‌కు థెరపీలు, ఇతర మందులు, డైపర్లు, ప్రత్యేకమైన ఆహారం వంటివన్నీ కలిపి నెలకు రూ.1.25 లక్షలు పైన ఖర్చు అవుతుంది. ఇక ఇంటి అద్దెతోపాటు పాప చదువుకు, అమ్మ మందులకు అయ్యేదంతా అదనం’’ అని శ్రీతేజ్‌ బాబాయి మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు.


తమదే బాధ్యత అని చెప్పారు కానీ..

తొక్కిసలాటలో తన భార్య చనిపోవడంతో.. జరగరాని నష్టం జరిగిందంటూ అల్లు అర్జున్‌ కుటుంబం తన పిల్లల పేరుమీద రూ.2 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారని శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ చెప్పారు. ఆ మొత్తానికి నెల నెలా బ్యాంకు వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారని, కానీ.. ఆ వడ్డీ డబ్బులు.. బాబు వైద్య చికిత్స ఖర్చులకు ఏమాత్రం సరిపోవడంలేదని అన్నారు. నెలకు రూ.2 లక్షల ఖర్చుకుతోడు జూన్‌లో బాబు కాళ్లకు ఆపరేషన్‌ చేయించినప్పుడు అదనంగా రూ.3 లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు.


బాబుకు సపర్యలు చేసేందుకు, చికిత్స చేయించేందుకు ఉద్యోగం కూడా మానేయడంతో ఎటువంటి ఆదాయం లేదని పేర్కొన్నారు. శ్రీతేజ్‌ ఆస్పత్రిలో ఉన్న సమయంలో.. అతడు పూర్తిగా కోలుకునే దాకా తమదే బాధ్యత అని, వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భర్తిస్తామని అల్లు అర్జున్‌ కుటుంబం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇదే విషయమై అల్లు అర్జున్‌కు గుర్తు చేసేందుకు ఆయన మేనేజర్‌ కాంతారావును సంప్రదించగా.. సానుకూల స్పందన రాలేదని తెలిపారు. కనీసం బాబు థెరపీల ఖర్చు వరకైనా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి

8 నెలలు.. 20వేల కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 04 , 2025 | 11:28 AM