Hyderabad: హైదరాబాద్లో.. మరో ఈవెంట్ గ్రౌండ్
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:29 AM
భాగ్యనగరంలో.. ఈవెంట్ గ్రౌండ్ ఏర్పాటవుతోంది. ప్రసాద్ మల్టీప్లెక్స్కు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహానికి మధ్యన ఉన్న మూడెకరాల స్థలంలో ఈ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నది. ఈ ఈవెంట్ గ్రౌండ్ను హైదరాబాద్ మెట్రో డవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఏర్పాటుచేస్తోంది.
- పీపుల్స్ప్లాజాకు సమీపంలో సిద్ధం చేస్తున్న హెచ్ఎండీఏ
- హైటెక్స్ తరహాలో అభివృద్ధి
- మూడెకరాల స్థలం.. సుమారు రూ.4 కోట్ల ఖర్చుతో..
హైదరాబాద్: నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరాన ఉన్న పీపుల్స్ ప్లాజా మైదానం ప్రఖ్యాతిగాంచింది. దానికి అతి సమీపంలోనే హైటెక్ హంగులతో మరో ఈవెంట్ మైదానం సిద్ధమవుతోంది. ప్రదర్శనలు, రాజకీయ సమావేశాలు, ఫిట్నెస్ ఈవెంట్లు నిర్వహించుకునేందుకు హెచ్ఎండీఏ ఏర్పాటు చేస్తున్నది. ప్రసాద్ మల్టీప్లెక్స్కు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహానికి మధ్యన ఉన్న మూడెకరాల స్థలంలో ఈ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నది. ఇప్పటికే ఇక్కడ సీసీ పనులు పూర్తవగా వర్షపు నీరు నిలువకుండా పైప్లైన్ వేశారు.

దాని కింది భాగంలో మెయిన్ సివరేజీ పైప్లైన్కు ఇబ్బందులు తలెత్తకుండా హైటెక్స్ గ్రౌండ్ మాదిరిగా ముస్తాబు చేయనున్నారు. గ్రౌండ్ను ఫేవర్ బ్లాక్స్తో సుందరంగా తయారు చేయడంతోపాటు అవసరమైన చోట్ల ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మైదానం చుట్టూరా రెయిలింగ్ గ్రిల్స్ను ఏర్పాటు చేయగా ప్రధాన రహదారిపై రెండు ప్రవేశ ద్వారాలు, వీవీఐపీ, ఎమర్జెన్సీల కోసం ఐమాక్స్ వైపు నుంచి మరో రెండు ప్రవేశ ద్వారాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో నీటిని నిల్వ చేసి, వినియోగించుకునేందుకు భారీ గుంతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మైదానాన్ని దాదాపు 4 కోట్ల రూపాయలతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది.

ఆదాయం కోసమే...
ఈ మైదానాన్ని రోజువారీ తరహా అద్దెకు ఇవ్వాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇప్పటికే పీపుల్స్ప్లాజా మైదానానికి లక్ష రూపాయలకుపైగా వసూలు చేస్తుండగా దీనిని దాదాపు లక్షన్నర రూపాయల వరకు తీసుకోవచ్చని హెచ్ఎండీఏ వర్గాలు తెలుపుతున్నాయి. త్వరలోనే ఈవెంట్ గ్రౌండ్ను అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News