GHMC: జోన్లు 12.. సర్కిళ్లు 60.. మెగా జీహెచ్ఎంసీకి తుదిరూపు ఖరారు
ABN , Publish Date - Dec 26 , 2025 | 08:30 AM
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 150 వార్డులుండగా.. దానిని ప్రస్తుతం 300 వార్డులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కాగా.. కుత్బుల్లాపూర్ జోన్లో అత్యధికంగా ఏడు సర్కిళ్లను ఏర్పాటు చేశారు.
- కుత్బుల్లాపూర్ జోన్లో అత్యధికంగా ఏడు సర్కిళ్లు
- పాలనా సౌలభ్యం కోసం అధికారాల వికేంద్రీకరణ
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహా నగరం ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేందుకు సిద్ధమైంది. మెగా జీహెచ్ఎంసీకి తుదిరూపు ఖరారైంది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ను ఔటర్ రింగ్ రోడ్డు అవతలి వరకు గల 2,053 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ(GHMC) అవతల గల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసుకొని 300 డివిజన్లతో మహా హైదరాబాద్ను ప్రకటించారు. విస్తరిత జీహెచ్ఎంసీ పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం అధికారాల వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతమున్న జోన్లు, సర్కిళ్లను రెట్టింపు చేశారు.
గతంలో జీహెచ్ఎంసీలో ఆరు జోన్లు ఉండగా.. విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం 12కు పెంచారు. గతంలో 30 సర్కిళ్లు ఉండగా, విస్తరిత జీహెచ్ఎంసీ పరిధిలో 60 సర్కిళ్లుగా అధికారులు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అధికార తర్జన భర్జనలు, స్థానికుల అభ్యంతరాలు నడుమ చివరికి జీహెచ్ఎంసీ తుదిరూపునకు వచ్చింది. వాటికి జోనల్ ఆఫీసులను, సర్కిళ్లు కార్యాలయాలను కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పెరిగిన జోన్లు, సర్కిళ్లు, సంబంధిత కార్యాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించాల్సి ఉన్నది. ఈ తుది పునర్విభజనకు సంబంధించి గెజిట్ విడుదల కావాల్సి ఉన్నది.
300 డివిజన్లు
గతంలో 150 డివిజన్లకు 30 సర్కిళ్లు ఉండగా, ప్రస్తుతం 300 డివిజన్లకు 60 సర్కిళ్లు చేశారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు ఉండగా, ప్రస్తుతం వాటిని కొనసాగిస్తూ అదనంగా కుత్భుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లుగా నిర్ణయించారు. గతంలో ఉన్న శేరిలింగంపల్లిజోన్ మొత్తం మారిపోయింది. కేవలం మియాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు సర్కిల్ను మాత్రమే చేర్చారు. విలీనమైన అమీన్పూర్, నార్సింగిలను చేర్చారు. జీహెచ్ఎంసీ విస్తరిస్తూ నిర్ణయించిన తర్వాత తుక్కుగూడ ప్రాంతవాసులు తమను చార్మినార్ జోన్లో చేర్చవద్దని, ఇలా వివిధ ప్రాంతాలవాసులు ఆందోళనకు దిగారు. అయితే ఆయా ప్రాంతాలవాసులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. తుక్కుగూడవాసులను శంషాబాద్ జోన్ పరిధిలోకి తెచ్చారు.

పాతబస్తీలో 3
పాతబస్తీకి సంబంధించి ప్రస్తుతం మూడు జోన్లు చేశారు. అందులో గోల్కోండ, చార్మినార్, రాజేంద్రనగర్లున్నాయి. ఇందులో పూర్తిగా పాతనగరానికి చెందిన ప్రాంతాలే ఉన్నాయి. ఇక కుత్భుల్లాపూర్ జోన్లో అత్యధికంగా ఏడు సర్కిళ్లు ఉండగా, ఆ తర్వాత రాజేంద్రనగర్ జోన్లో ఆరు సర్కిళ్లున్నాయి. ఇక శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్, ఉప్పల్, మల్కాజిగిరి, చార్మినార్ జోన్లలో ఐదు సర్కిళ్లు ఉండగా, కూకట్పల్లి, ఎల్బీనగర్, శంషాబాద్లలో నాలుగు సర్కిళ్లున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News