Texas Temple Scam: ఆస్టిన్ సాయిబాబా గుడిలో నిధుల గోల్మాల్!
ABN , Publish Date - Aug 27 , 2025 | 03:59 AM
అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల అవకతవకలకు ప్రవాసాంధ్రులు బలయ్యారు. ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఈ కుంభకోణం, ఇప్పుడు ఆలయాల్లో సైతం జరగడం గమనార్హం.
17 కోట్లు తినేసిన ఆలయ పాలకవర్గం
డొల్లకంపెనీలకు మ్యాచింగ్గ్రాంట్ నిధుల
బదిలీ.. ఇద్దరు ప్రవాసాంధ్రుల హస్తం
బాధితుల్లో యాపిల్, వీసా, డెల్ కంపెనీల
ఉద్యోగులు.. రంగంలోకి ఫెడరల్ సంస్థలు
(డల్లాస్ నుంచి కిలారు గోకుల్కృష్ణ): అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల అవకతవకలకు ప్రవాసాంధ్రులు బలయ్యారు. ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఈ కుంభకోణం, ఇప్పుడు ఆలయాల్లో సైతం జరగడం గమనార్హం. తాజాగా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ సమీపంలోని సీడర్ పార్కులో గల శ్రీ షిర్డి సాయిబాబా టెంపుల్ (ఎస్ఎ్సబీటీ)లో సుమారు రూ.17 కోట్లను కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ పథకం ద్వారా సేకరించిన బోర్డు సభ్యులు.. సరైన ఆమోదం లేకుండా స్వలాభానికి వినియోగించుకున్నారు. ఈ సొమ్ములను రికవరీ చేసి కార్పొరేట్ సంస్థలకు తిరిగి చెల్లించాలని ప్రస్తుత కార్యవర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను స్వలాభానికి వాడుకోవడమే గాక, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి.. భక్తులు ఇచ్చిన విరాళాలను దారి మళ్లించారనే అభియోగాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఆలయాల్లో ఇలాంటి అక్రమాలు జరగడం దురదృష్టకరమని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడుతున్నారు.
కుంభకోణం బయటపడిందిలా..
2007లో హవాయి నుంచి ఆస్టిన్ వచ్చిన జిల్ ఎడ్వర్డ్స్, క్రెయిగ్ ఎడ్వర్డ్స్ దంపతులు సీడర్ పార్కులో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2010లో బాబా ఆలయాన్ని ప్రారంభించారు. నాన్-మెంబర్ సంస్థగా మొదలైన ఈ ఆలయానికి క్రెయిగ్ చైర్మన్గా, జిల్ కార్యదర్శిగా వ్యవహరించారు. నాన్-మెంబర్ సంస్థ అయినప్పటికీ మెంబర్ సంస్థ రీతిలో ఒక్కో కుటుంబం నుంచి10-20 వేల డాలర్లు వసూలు చేసి, సభ్యులను చేర్చుకున్నారు. అలా 150 మందిని ట్రస్టీలుగా ఏర్పాటు చేసుకున్నారు. 2010-14 మధ్య కాలంలో జిల్-క్రెయిగ్ దంపతులు ఆలయాన్ని తమ కనుసన్నల్లో నడిపించారు. వీరికి బాలాజి, కిషోర్ అనే ఇద్దరు ప్రవాసాంధ్రులు సహకరించారు. వీరంతా కలిసి ఆలయ బోర్డుగా ఏర్పడి మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణానికి పాల్పడ్డారు. ఆలయ ప్రాంగణంలో 2015లో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. క్రెయిగ్ మృతితో ఇద్దరు ప్రవాసాంధ్రులు జిల్తో చేతులు కలిపి 2016 నుంచి మ్యాచింగ్ గ్రాంట్ల పథకం ద్వారా అడ్డదారిలో నిధులు పోగేసుకునేందుకు భక్తులను పావులుగా వాడుకున్నారు. ఆలయంలో వాలంటీరుగా పనిచేసే ఒక భక్తుడిని ఈ కార్యవర్గం మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా నిధులు తేవాలని కోరింది. ఆ భక్తుడు యాపిల్ సంస్థలో తనకిచ్చిన షేర్లలో కొన్నింటిని విక్రయించగా వచ్చిన 40 వేల డాలర్లతో పాటు తన ముగ్గురు సహోద్యోగుల ద్వారా మొత్తం 1.20 లక్షల డాలర్ల్లను ఆలయ ఖాతాలో జమచేశారు.
ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆ నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాగే మ్యాచింగ్ గ్రాంట్ల అవకతవకలకు పాల్పడిన 20 మందికి పైగా యాపిల్లో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వీసా సంస్థలో సీనియర్ డైరెక్టర్గా ఉన్న మరో వ్యక్తి ఇలాగే నిధుల సేకరణ జరిపి, ఆ వివరాలను సంస్థ అంతర్గత బృందాల్లో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అతని కారణంగా మరో 100 మందకిపైగా ఉద్యోగాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. మొత్తంమీద 120 మంది ప్రవాసాంధ్రుల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాపిల్, వీసాతో పాటు డెల్ సంస్థ ఉద్యోగులు కూడా బాధితుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఉద్యోగాలు కోల్పోవడమేగాక, వారికి లభించే ప్రయోజనాలన్నీ కలిపితే రూ.వందల కోట్లు నష్టపోయినట్లవుతుంది. కాగా, అక్రమంగా సేకరించిన రూ.17 కోట్లను అప్పటి కార్యవర్గం తమ అద్దెలు చెల్లించడానికి వాడారని, ఇండియాకు మనీ లాండరింగ్ చేశారని, డొల్ల కంపెనీ అయిన సాయి చారిటీ్సకు బదలాయించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 40 వేల డాలర్లు కోల్పోయిన వ్యక్తి తన బాధను వెలిబుచ్చుతూ 2023 నవంబరులో ఆలయ ట్రస్టీలకు మెయిల్ పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆలయ నాయకత్వంలో మార్పు కోసం తిరగబడ్డారు. శ్వేత జాతీయురాలితో పాటు ఇద్దరు ప్రవాసాంధ్రులు రాజీనామా చేశారు. కొత్త కార్యవర్గం జరిపిన ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆస్టిన్ను వీడిన జిల్..
క్రెయిగ్ మృతి తర్వాత జిల్ రెండో పెళ్లి చేసుకుంది. నూతన కార్యవర్గం 2024 అక్టోబరులో సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. 2025 జనవరిలో డొల్ల కంపెనీలను మూసేసిన జిల్.. ఆస్టిన్ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఫెడరల్ సంస్థలు ఆలయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నాయి.8 17 కోట్లు తినేసిన ఆలయ పాలకవర్గం
మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే..?
సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులు విరాళం ఇచ్చే ప్రతి డాలరుకు వాటి అంతర్గత విధివిధానాలను అనుసరించి రెండింతలు జోడిస్తాయి. అంటే ఉద్యోగి 100 డాలర్లు ఇస్తే.. కంపెనీ 200 డాలర్లు ఇస్తుంది. మొత్తం 300 డాలర్లనూ సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..