BJP: మోదీ నేతృత్వంలో అద్భుత ప్రగతి
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:54 AM
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు 11 ఏళ్లుగా నీతిమంతమైన, పారదర్శక, సమర్థ పాలన అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్
ఉగ్ర పాక్కు క్షిపణి దాడులతో సమాధానం
బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి: కిషన్ రెడ్డి
బోయినపల్లి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు 11 ఏళ్లుగా నీతిమంతమైన, పారదర్శక, సమర్థ పాలన అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. విదేశీ, ఐటీ, రక్షణ రంగ ఎగుమతుల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని తెలిపారు. నేడు ప్రపంచ దేశాలు ఏ సమావేశం నిర్వహించినా భారత ప్రధానిగా మోదీ ముందు వరుసలో నిలబడే స్థాయికి మన దేశం ఎదిగిందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛభారత్ టాయిలెట్ నుంచి చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగురవేసే వరకు ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధించామని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో రోజూ మీడియాలో కుంభకోణాలే పతాక శీర్షికల్లో ఉండేవని విమర్శించారు. కేంద్రం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అమెరికా రోడ్లను తలదన్నేలా నేడు మన దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఏ నగరానికి వెళ్లడానికైనా ప్రపంచ స్థాయి రోడ్లు ఉన్నాయని వివరించారు.
తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామని వెల్లడించారు. రూ.వేల కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో ఆధునీకరిస్తున్నామని తెలిపారు. గతంలో దేశంలోని అన్ని నగరాల్లో పాకిస్థాన్ ఐఎ్సఐ ఏజెంట్లను పెట్టుకునేదని కిషన్రెడ్డి తెలిపారు. ఎన్ని దాడులు జరిగినా నాటి ప్రభుత్వం పాకిస్థాన్ను ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేదన్నారు. నేడు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులతో పాకిస్థాన్కు వణుకు పుట్టిస్తున్నామని చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఒక్క డ్రోన్ వచ్చినా.. తాము బ్రహ్మోస్ క్షిపణితో సమాధానం చెబుతామని హెచ్చరించారు. పాలన చేతగాక, హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని కిషన్రెడ్డి విమర్శించారు. అప్పులు ఇచ్చేవారు, తనను నమ్మేవారు లేరని బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సోనియా మాటలు, ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రె్సకు ఓటు వేస్తే.. ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చి.. వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బలి అయిందని విమర్శించారు. ధనికరాష్ట్రంగా మొదలై రూ.లక్షల కోట్ల అప్పులపాలైందన్నారు. అవినీతి, దోపిడీ, కుంభకోణాలు, అహంకారం, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారని మండిపడ్డారు. నాలుగు కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో కాషాయజెండా ఎగరడం ఖాయమన్నారు.
మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న రేవంత్: ఈటల
అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దెబ్బతీస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కరోనాతో ప్రపంచమంతా విలవిల్లాడిన సమయంలో ప్రధాని మోదీ వ్యాక్సిన్ల తయారీని ప్రోత్సహించారని తెలిపారు. దేశ ప్రజలతో పాటు విదేశాలకు కూడా టీకాలు ఇచ్చిన ఘనత భారత్కు దక్కిందన్నారు. మన దేశంలోని మేధోశక్తి విదేశాలకు వలస వెళ్లొద్దని భావించి ప్రధాని మోదీ మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. రూ.కోట్ల నిధులు ఇచ్చి స్టార్టప్ కంపెనీలను కేంద్రం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..