Share News

Kaleshwaram project: కాళేశ్వరం రుణాల చెల్లింపుల్లో సర్కారు విఫలం

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:24 AM

కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.

Kaleshwaram project: కాళేశ్వరం రుణాల చెల్లింపుల్లో సర్కారు విఫలం

  • ఈనెల 28లోపు రూ.1,320 కోట్లు చెల్లించాలని ఆర్‌ఈసీ లేఖ

  • లేకుంటే.. దివాళాగా ప్రకటించే ప్రమాదం

  • రాష్ట్ర క్రెడిట్‌ రేటింగ్‌పైనా ప్రతికూల ప్రభావం

  • రేవంత్‌.. ఓ అవినీతి చక్రవర్తి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. గురువారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేఐపీసీఎల్‌), తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్థి సంస్థ(టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌) పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించి రూ.1,393.65 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ-- రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆమె వివరించారు. ఈ నెల 28లోపు ఆ బాకాయిలను చెల్లించాలని గడువు విధించిందని, లేని పక్షంలో దివాళా(నిరర్థక రుణం)గా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు.


దీనివల్ల రాష్ట్ర రుణపరపతి, క్రెడిట్‌ రేటింగ్‌పైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రుణాల పునర్వ్యవస్థీకరణకు చేసిన విజ్ఞప్తిని ఆర్‌ఈసీ తిరస్కరించిందని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై త్వరలోనే పుస్తకాలను ప్రచురించి, రాష్ట్రమంతటా పంచుతామన్నారు. గురువారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రేవంత్‌ రెడ్డి కేవలం 18 నెలల్లోనే రూ.2లక్షల కోట్ల అప్పులు తెచ్చి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమీషన్లు తీసుకున్నారు. కొత్తగా ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. పింఛన్లు పెంచడం లేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వకుండా.. అప్పు తెచ్చిన రూ.2 లక్షల కోట్లను ఏం చేశారు?’’ అని ఆమె ప్రశ్నించారు. తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


చంద్రబాబుపై మాట్లాడాలంటే భయపడుతున్నారు

2024 జూలై 6వ తేదీన ప్రజాభవన్‌లో రేవంత్‌రెడ్డితో సమావేశమైన తర్వాతే చంద్రబాబు పోలవరం - బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. రేవంత్‌ రెడ్డి ఇప్పటికి కూడా పోలవరం - బనకచర్లపై అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేయడం లేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు. చంద్రబాబుకు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ బిర్యానీ తినిపించి.. గోదావరి నీళ్లను గిఫ్ట్‌ ప్యాక్‌గా ఇచ్చారు’’ అని ఆరోపించారు. ఆంధ్రా బిర్యానీ ఎట్లుంటదో గతంలోనే కేసీఆర్‌ చెప్పారని ఆమె గుర్తుచేశారు.


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 27 , 2025 | 04:24 AM