Formula E Case: ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. దూసుకొచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు.. అరెస్ట్
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:28 AM
ED Office: ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్ ఈడీ ఆఫీసుకు వస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ముందుగానే పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

హైదరాబాద్, జనవరి 16: ఫార్ములా ఈ కేసు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్ ఈడీ ఆఫీసుకు వస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ముందుగానే పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ వాహనం రాగానే ఒక్కసారిగా ఈడీ కార్యాలయం వైపుకు నేతలు, కార్యకర్తలు దూసుకొచ్చారు.
ముందుగానే 200 మందితో భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులను ఈడీ కార్యాలయానికి వెళ్లనీయకుండా అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. కేటీఆర్ కారు వచ్చిన వెంటనే వందల మంది కార్యకర్తలు కారు చుట్టేశారు. కేటీఆర్కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో వారందరినీ అతి కష్టమ్మీద అక్కడి నుంచి తరలించిన తర్వాతే కేటీఆర్ కారును లోపలికి తీసుకెళ్లారు పోలీసులు. ఆపై ఈడీ కార్యాలయం వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసు జులుం నశించాలి అంటూ బీఆర్ఎస్ నేతల నినాదాలు చేశారు. అనుమతి లేకుండా లోపలికి వచ్చారంటూ పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమారు వంద మంది కార్యకర్తలు ఈడీ కార్యాలయం నుంచి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. అయితే భారీగా కార్యకర్తలు ఈడీ కార్యాలయానికి తరలిరావడంతో వారిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.
ఆంక్షలు...
మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈడీ ఆఫీసు ముందు ఉన్న రోడ్డుపై వాహనాలను అనుమతించని పరిస్థితి. గన్పార్క్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లిస్తున్నారు. కేవలం ఆయ్కార్ భవన్ మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. కాగా.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా నిధుల మళ్లింపుపైనే కేటీఆర్ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. ఒక్కొక్కరిని తొమ్మిది గంటల పాటు విచారించిన ఈడీ.. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఒప్పందాలు, లావాదేవీలు, ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏవిధంగా లావాదేవీలు జరిపారు అనే అంశాలపై పూర్తి స్థాయి వివరాలను సేకరించడంతో పాటు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..
Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు
Read Latest Telangana News And Telugu News