Share News

Telangana Vision Document 2047: విజన్‌ డాక్యుమెంట్‌-2047 ఓ దిక్సూచి: డిప్యూటీ సీఎం మల్లు

ABN , Publish Date - Dec 09 , 2025 | 07:41 PM

తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. ప్రపంచానికి హైదరాబాద్‌ ఒక ఐకానిక్‌ సిటీ అని అభివర్ణించారు.

Telangana Vision Document 2047: విజన్‌ డాక్యుమెంట్‌-2047 ఓ దిక్సూచి: డిప్యూటీ సీఎం మల్లు

హైదరాబాద్, డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి విజన్‌ డాక్యుమెంట్‌-2047 ఓ దిక్సూచి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. విస్తృత సంప్రదింపులు, నిపుణుల అభిప్రాయ సేకరణ తర్వాతే..ఈ తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047ను రూపొందించామని తెలిపారు. మంగళవారం తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ - 2025లో సెషన్లు ముగిశాయి. అనంతరం తెలంగాణ విజన్‌-2047 డాక్యుమెంట్‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ విజన్‌ డాక్యుమెంట్‌ మనందరిది అని స్పష్టం చేశారు. సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం ముగియనున్న ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.


ప్రపంచానికి హైదరాబాద్‌ ఒక ఐకానిక్‌ సిటీ: ఆర్బీఐ మాజీ గవర్నర్

తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. ప్రపంచానికి హైదరాబాద్‌ ఒక ఐకానిక్‌ సిటీ అని అభివర్ణించారు. దేశంలోనే హైదరాబాద్‌ అద్భుత ప్రగతి సాధిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజన్‌ డాక్యుమెంట్‌లో భాగస్వామ్యం కావడం తనకు సంతోషకరంగా ఉందన్నారు. చైనా వాంగ్‌డాంగ్‌ను మించి తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు.


అభివృద్ధిలో ప్రత్యేక మార్గం ఎంచుకుంటున్న తెలంగాణ: ఆనంద్‌ మహీంద్రా

తెలంగాణ విజన్ చాలా మార్గదర్శకంగా ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రత్యేక మార్గం ఎంచుకుంటోందని ఆయన పేర్కొన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ చైర్మన్‌గా ఉండటం తన అదృష్టమని ఆయన చెప్పారు. యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ దేశ భవిష్యత్‌ అని ఆనంద్‌ మహీంద్రా అభివర్ణించారు.


సమ్మిట్‌లో రూ. లక్షల కోట్ల పెట్టుబడులు..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ. 5, 39, 495 కోట్లు ఎంఓయూలు ద్వారా పెట్టుబడులుగా వచ్చాయి. తొలి రోజు రూ. 2,00,043 కోట్లు.. రెండో రోజు ఇప్పటి వరకు రూ. 2,96,495 కోట్లు పెట్టుబడులుగా వచ్చాయి. పరిశ్రమలు, ఐటీ, పవర్, స్పోర్ట్స్, టూరిజం, ఫారెస్ట్ తదితర రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇక విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో పెట్టుబడుల్లో ఒప్పందాలు కుదిరాయి.


గ్లోబల్ సమ్మిట్‌లో రూ. 3, 24, 698 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ఈ రెండు రోజుల్లో 1,40,500 మంది తెలంగాణ యువతకు ఉపాధి కల్పించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో భారీ ఒప్పందాలు కుదిరాయి. పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ అని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ కోసం విద్యుత్ శాఖ పకడ్బందీ ప్రణాళిక అమలు చేసిందని చెప్పారు. ఈ పెట్టుబడులు ఆకర్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. అలాగే ఒప్పందాల పురోగతిని ఆయన స్వయంగా పర్యవేక్షించారు.


తద్వారా రెండు రోజుల్లోనే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. టీఎస్ జెన్‌కో, రెడ్కో సింగరేణి వివిధ కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు: హోం మంత్రి

తెలంగాణలో స్కూళ్లకు 6 రోజులపాటు సెలవు.. ఎందుకంటే?

For More TG News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 08:04 PM