Sama Ram Mohan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:08 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ టీపీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయంటూ ఆరోపించారు. అందులోభాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎన్నికవుతున్నారని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 30: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన వేళ.. టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తుందని.. అలాగే కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదే రెండు పార్టీల సారాంశమని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకం జరగనుందని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఈక్వల్ టూ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామా రామ్మోహన్ రెడ్డి.. తన ఎక్స్ ఖాతా వేదికగా సోమవారం వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరిగే వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రామ్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నియమించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రామచందర్రావు పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. అదీకాక ఈ పదవికి మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో రామచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశముంది.
ఇక ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో బీఆర్ఎస్ పార్టీ నేతలకు రాజకీయంగా వైరం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మరోవైపు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల మందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను ఆ పదవి నుంచి తొలగించి.. ఆ స్థానంలో కిషన్ రెడ్డిని పార్టీ అగ్రనాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయాన్ని ఆ పార్టీలోని పలువురు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిలో ప్రముఖ నటి విజయశాంతి సైతం ఉన్నారు. కానీ ఆమె సూచనలు, సలహాలను సైతం ఆ పార్టీ అగ్రనాయకత్వం పక్కన పెట్టింది. దీంతో బీజేపీకి విజయశాంతి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు కోసమే బీజేపీ అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఒక వాదన ఆ సమయంలో బలంగా నడిచింది.
ఇంకోవైపు.. ఈ ఏడాది వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం ఆ పార్టీ అగ్రనేత, మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. అయితే ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లేఖ పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. అనంతరం బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆ క్రమంలో ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె తీహాడ్ జైలుకు వెళ్లడం.. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కేసీఆర్.. బీజేపీతో పొత్తుకు మంతనాలంటూ పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలపై రాజకీయంగా తీవ్ర చర్చ జరిగింది. అలాగే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ప్రస్తుతం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుందనే ఓ చర్చ అయితే సాగుతుంది. అలాంటి వేళ.. టీపీసీపీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో ప్రమాదంపై ప్రధాని మోదీ సహా ప్రముఖుల విచారం
బిహార్ ఎన్నికల్లో మహా కూటమితో కలిసి మజ్లిస్ పోటీ..
Read Latest Telangana News And Telugu News