Share News

Hyderabad Ganja Seizure: 908 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

ABN , Publish Date - Oct 23 , 2025 | 03:37 PM

బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నిందితుల్ని అరెస్టు చేశామని.. సుమారు 908 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.2.70 కోట్లు ఉంటుందని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.

Hyderabad Ganja Seizure: 908 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్
Hyderabad Ganja Seizure

హైదరాబాద్, అక్టోబర్ 23: నగరంలోని బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.70 కోట్ల విలువైన 908 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేశారు. ఈ వ్యవహారంపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశామన్నారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నిందితుల్ని అరెస్టు చేశామని.. సుమారు 908 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.2.70 కోట్లు ఉంటుందని తెలిపారు. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర నాసిక్‌ వైపు రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు.


ఈ కేసులో A-1 మొహమ్మద్ కలీం ఉద్దీన్ డ్రైవర్/ గంజాయి ట్రాన్స్‌పోర్టర్, A-2 షేక్ సోహైల్, A-3 మొహమ్మద్ అఫ్జల్ @ అబ్బులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన రెహమాన్, ఒడిశాకు చెందిన జిథు , శ్రీకాకుళానికి చెందిన సురేష్, మహారాష్ట్రకు చెందిన మహేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. మహారాష్ట్రకు చెందిన మహేష్ గంజాయిని కొనుగోలు చేస్తున్నాడని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరిలో మారుమూల అటవీ ప్రాంతంలో సురేష్ , జిథు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికి ప్లాన్ చేశారని.. గంజాయి సరఫరాలో రెహమాన్ ప్రధాన రవాణాదారుడిగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. రిసీవర్ మహేష్ ఒడిశాలోని జిథు, సురేష్ వద్ద గంజాయి సేకరించారన్నారు. వారి నుంచి ఐషర్ డీసీఎం ట్రాన్స్‌పోర్ట్ వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు.


గంజాయిని హెచ్‌డీపీఈ సంచుల్లో నింపి, వాటిని జీడిపప్పు కింద దాచిపెట్టి టార్పాలిన్‌తో కప్పి రవాణా చేస్తున్నారని వివరించారు. హైదరాబాద్ మీదుగా నాసిక్, మహారాష్ట్ర వైపు రవాణా చేస్తున్నారన్నారు. పక్కా సమాచారంతో బండ్లగూడ వద్ద సోదాలు చేయగా గంజాయి పట్టుబడిందన్నారు. ప్రధాన నిందితుడు సురేష్ ఒక్క ట్రిప్‌కు రూ.3 నుంచి రూ.5లక్షల పారితోషికం ఇస్తానని రెహమాన్‌కు ఆఫర్ చేశాడని.. అందుకే గంజాయి సరఫరాకి దాంతో రెహమాన్ అంగీకరించాడన్నారు. నిందితులంతా చిన్ననాటి స్నేహితులుగా దర్యాప్తులో తేలిందని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

పోచారం కాల్పుల కేసుపై రాచకొండ సీపీ ఏమన్నారంటే..

పోచారం కాల్పుల కేసులో పోలీసుల పురోగతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 23 , 2025 | 05:38 PM