Share News

KTR Slams CM Revanth Reddy: రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా: కేటీఆర్

ABN , Publish Date - Dec 26 , 2025 | 03:02 PM

బీఆర్ఎస్‌కు అండగా నిలుస్తున్న హైదరాబాద్ వాసులకు పాదాభివందనం చేసినా తప్పులేదని కేటీఆర్ పేర్కొన్నారు. నిజమైన మార్పు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రారంభమైందని సంతోషం వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూములు కబ్జా చేస్తుంటే కేసు పెట్టిన పోలీసు అధికారిని లూప్ లైన్లో పెట్టారని విమర్శించారు.

KTR Slams CM Revanth Reddy: రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా: కేటీఆర్
BRS Working President KTR

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, ప్రియాంక గాంధీ మీద ఒట్టు పెట్టి హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగవేశారని మండిపడ్డారు. నెలకు రూ.2, 500 ఇవ్వడానికి ముఖం లేదు కానీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారని విమర్శించారు. రోడ్లపై పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డి పెద్ద స్థాయికి వస్తే మంచిదే.. కానీ మంచి పనులతో రావాలని సూచించారు. పేమెంట్ కోటాలో సీఎం అయ్యి.. ఇప్పుడు కూడా నెలనెలా న్యూఢిల్లీకి సంచులు పంపుతున్నారని ఆరోపించారు. రోజూ తిట్ల పురాణం తప్ప ఇంకోటి లేదంటూ సీఎం రేవంత్ వ్యవహార శైలిని ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఏం భాష? అంటూ ప్రశ్నించారు.


హైదరాబాద్ గల్లీల్లో తిరిగిన తాను సైతం తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషులో బూతులు తిట్టగలనని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆయన భార్య గీతమ్మకు సూచించారు. ఏనుగు లాంటి కేసీఆర్‌ను తిడుతున్నారు.. చావు కోరుకుంటున్నారన్నారు. కోటి మంది మహిళలకు జనవరి ఒకటి నుంచి నెలకు రూ. 2,500 ఇస్తామని శపథం చేయాలంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లు తులం బంగారం ఇస్తామని శపథం చేయాలన్నారు.

బీఆర్ఎస్‌కు అండగా నిలుస్తున్న హైదరాబాద్ వాసులకు పాదాభివందనం చేసినా తప్పులేదని పేర్కొన్నారు. నిజమైన మార్పు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రారంభమైందని సంతోషం వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూములు కబ్జా చేస్తుంటే కేసు పెట్టిన పోలీసు అధికారిని లూప్ లైన్లో పెట్టారని విమర్శించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పేరు గాంధీ... చేసేవి మాత్రం గాడ్సే పనులు, భూకబ్జాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెబుతున్నారని చెప్పారు. స్పీకర్ కళ్లు ఉండి చూడలేని ధృతరాష్ట్రునిలా తయారయ్యారని వ్యంగ్యంగా అన్నారు. ఎన్నికలకు భయపడి పది మంది ఎమ్మెల్యేలు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావాంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు. కేసీఆర్ ఒక్క మీటింగ్, ప్రెస్ మీట్ పెడితేనే ముచ్చెమటలు పట్టాయి.. చలిజ్వరం వచ్చిందంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తారని స్పష్టం చేశారు. తన తండ్రిని తిడుతున్నందుకు తనకు చాలా కోపంగా ఉందన్నారు. తాను గుంటూరులో చదివితే తప్పేమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాగా చదువు లేకుండా తిరగలేదన్నారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పు అట కానీ ఆయన ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


మరి రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా? అంటూ ప్రశ్నించారు. అమెరికాలో ఎవరి పని వారు చేసుకోవాలి.. తాను చేసుకుంటే తప్పా? అని పేర్కొన్నారు. ఆయనలా తాను దొంగ పనులు చేయలేదని తెలిపారు. రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదన్నారు. తాను తన తండ్రి పేరు చెప్పుకుంటే తప్పేమిటి? తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దిల్లీకి సంచులు మోసుకుంటూ గులాం లాగా తాము బతకబోమని.. తెలంగాణ పౌరుషంతో బతుకుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వబోమని రేవంత్ రెడ్డి అంటున్నారు... ఆయన్ని కొడంగల్‌లో గెలవకుండా చేద్దామంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.


పాలమూరు - రంగారెడ్డి గురించి కేసీఆర్ అడిగితే సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో కార్పొరేషన్లు చేసినా గెలిపించే బాధ్యత తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. 2026లో గట్టిగా కష్టపడితే... 2027లో ఎన్నికల వాతావరణ వస్తుందన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడదామంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దమ్ముంటే శేరిలింగంపల్లి రావాలి, ఉప ఎన్నికల్లో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే గాంధీకి కేటీఆర్ సవాలు విసిరారు. కేసీఆర్ దయతో అరికెపూడి గాంధీ ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం

క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది: ఆర్ఎస్ఎస్ చీఫ్

For More TG News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 03:26 PM