Kishan Reddy Cotton Procurement: పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే టాప్
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:01 PM
పత్తి రైతులు దళారుల చేతిలో పడి మోస పోవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం చివరి క్వింటాల్ వరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వరితో పాటు అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి అని.. రాష్ట్రంలో 45లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోందని తెలిపారు. 22 లక్షలకు పైగా రైతులు పత్తిని పండిస్తున్నారన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. పత్తి రైతులు దళారుల చేతిలో పడి మోస పోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చివరి క్వింటాల్ వరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.
క్వింటాల్ పత్తి రూ.8,110 ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతోందని.. పత్తి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ముందు ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలను మరో 12పెంచామని.. మొత్తం 122 కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు కేంద్రమంత్రి. పత్తి సాగు ఉత్పత్తిలో సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. తొమ్మిది ప్రాంతీయ భాషల్లో పత్తి సాగుకు సంబంధించి కిసాన్ యాప్ను తీసుకొచ్చామని.. యాప్లో రైతులు నమోదు చేసుకుంటే.. స్లాట్ ద్వారా పత్తిని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని అన్నారు. పత్తి శుద్ధి, రవాణా కోసం జిన్నింగ్ మిల్లులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. హై డెన్సిటీ ప్లాంటేషన్ వల్ల పంట దిగుబడి డబుల్ అవుతుందని తెలిపారు. మహారాష్ట్ర అకోలా ప్రాంత ప్రజలు హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్నారని.. హై డెన్సిటీ ప్లాంటేషన్పై అవగాహన కోసం అవసరమైతే రైతులను మహారాష్ట్రకు తీసుకెళ్తామని చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి మన రైతులు హై డెన్సిటీ ప్లాంటేషన్ చేసేలా పని చేస్తామన్నారు. కిసాన్ యాప్ దీపావళి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పదేళ్లలో కనీస మద్దతు ధర వంద శాతం పెరిగిందన్నారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ పెట్టీ జైలుకు పంపుతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బంద్కు ప్రధాన కారణం బీజేపీనే: డిప్యూటీ సీఎం భట్టి
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Read Latest Telangana News And Telugu News