Kavitha: ఉద్యోగాలు వచ్చిన వారిపై కోపం లేదు.. గ్రూప్-1పై కవిత సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 08 , 2025 | 07:23 PM
కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేస్తుందని కవిత ఆరోపించారు. ప్రొఫెసర్ హరగోపాల్ని స్వయంగా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు.
హైదరాబాద్: విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడానికే గ్రూప్-1 పెట్టారా..? అని ఆమె ప్రశ్నించారు. తెలిసో, తెలియకో గత పదేళ్లలో గ్రూప్-1 పెట్టలేదని పేర్కొన్నారు.
నిరుద్యోగులతో అధికారంలోకి వచ్చి వాళ్లనే సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు కవిత. ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థుల పేపర్లను బయట పెట్టమని పరీక్ష రాసిన అభ్యర్థులు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇవాళ (బుధవారం) గన్పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు..
కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేస్తుందని కవిత ఆరోపించారు. ప్రొఫెసర్ హరగోపాల్ని స్వయంగా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు.
విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తే కుర్చీలో నుంచి తీసి బయట పడేస్తారని కవిత హెచ్చరించారు. రేపు (గురువారం) ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికావొద్దని హితవు పలికారు. ఉద్యోగాలు వచ్చిన వారిపై కోపం లేదు.. అక్రమంగా తెచ్చుకున్న వారిపైనే తమ కోపమంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.