Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. తొలిరోజు ఎంతమంది నామినేషన్లు వేశారంటే
ABN , Publish Date - Oct 13 , 2025 | 03:34 PM
స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా... తొలిరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది.
హైదరాబాద్, అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు (Jubilee Hills Bypoll) ఈరోజు (సోమవారం) నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణా పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అలాగే నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా.. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా... తొలిరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది.
ఆంక్షలు అమలు: ఎన్నికల అధికారి
కాగా.. ఈరోజు ఉదయం ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవగా..హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈనెల 21వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం 100 మీటర్ల వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. 100 మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 4 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారని చెప్పారు. నియోజవర్గ పరిధిలో 45 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని ఎన్నికల అధికారి కర్ణన్ వెల్లడించారు.
మరోవైపు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరునే బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎల్లుండి (ఈనెల 15) తమ అభ్యర్థి మాగంటి సునీతతో నామినేషన్ వేయించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. మొత్తం నలుగురు సభ్యుల పేర్లను ఏఐసీసీకి పంపగా.. అందులో నవీన్ యాదవ్ను అధిష్టానం ఎంపిక చేసింది. ఇక జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే ఆరుగురు పేర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు ఢిల్లీకి పంపించారు. నేడు లేదా రేపు బీజేపీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే
సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News