Phone Tapping Case: దూకుడు మీద సిట్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:00 AM
మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను సిట్ విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పోలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను కూడా విచారించింది.
హైదరాబాద్, డిసెంబర్ 22 : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది. దాంతో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్యాపింగ్ రివ్యూ కమిటీలోని వారిని సిట్ మరోసారి విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ను సిట్ మరోసారి విచారించింది. వారి ఇచ్చిన స్టేట్మెంట్లను సిట్ రికార్డు చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్లతోపాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది.
మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను కూడా విచారించింది. ఎస్ఐబీ ఓఎస్డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది. గత ప్రభుత్వంలో ఈ ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతోపాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు తమ దర్యాప్తులో సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను యథావిథిగా హోం శాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనుబంధ ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశించిన విషయం విదితమే.
రంగంలోకి సిద్ధిపేట సీపీ..
మరోవైపు ఈ కేసులో మూడో రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఆయన్ని విచారించేందుకు సిట్లో సభ్యుడు అయిన సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్ ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రభాకర్ రావును సిద్ధిపేట సీపీ విచారించనున్నారు. గతంలో ఇదే కేసులో పలుమార్లు ప్రభాకర్ రావును విజయ్ కుమార్ విచారించిన విషయం విదితమే. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే ఒక చర్చ సైతం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ విమర్శలు.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి
తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష.. హాజరు కానున్న మంత్రులు
For More TG News And Telugu News