Harish Rao Gulf Workers: 12 మంది గల్ఫ్ కార్మికులను వెనక్కి రప్పించాల్సిందే.. హరీష్ డిమాండ్
ABN , Publish Date - Oct 10 , 2025 | 03:15 PM
నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని మాజీ మంత్రి అన్నారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక.. కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ గల్ఫ్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీకి అతి గతి లేదని విమర్శించారు. కనీసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు దిక్కులేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో వలసలు వాపస్ అయితే.. కాంగ్రెస్ పాలనలో వలసలు మొదలయ్యాని వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటం సిగ్గుచేటన్నారు.
నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని మాజీ మంత్రి అన్నారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక.. కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఉపాధి, ఉద్యోగాలు కరువై ఎడారి ప్రాంతాలకు వలస పట్టే దుస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే.. కాంగ్రెస్ పార్టీ వలస కార్మికుల కుటుంబాలను కూడా దారుణంగా వంచించిందని అన్నారు.
అభయ హస్తం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది తప్ప, ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నర పాలన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులు సంక్షోభంలో ఉంటే ఆ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులు, సభ్యులు ఏం చేస్తున్నట్లని నిలదీశారు. మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నారైల సంక్షేమ బోర్డు, గల్ప్ సంక్షేమ బోర్డులకు అతీ గతి లేదన్నారు. విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తానన్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఇప్పటికీ దిక్కులేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపి జోర్డాన్లో ఉన్న గల్ఫ్ కార్మికులను వెంటనే తెలంగాణకు రప్పించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
అందరూ కలిసి ఓడగొట్టారు.. అంజన్ ఆవేదన
కాంగ్రెస్ చెంపలేసుకుని క్షమాపణన చెప్పాల్సిందే: ఈటెల
Read Latest Telangana News And Telugu News