Jubilee Hills Ticket Controversy: అందరూ కలిసి ఓడగొట్టారు.. అంజన్ ఆవేదన
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:51 PM
పార్టీ చర్యలతో మనస్తాపం చెందినట్లు అంజన్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సీనియర్నని.. తానెప్పుడు ఎప్పుడూ ఓడిపోలేదని.. అందరూ కలిసి ఓడగొట్టారని వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: జూబ్లీహిల్స్ నియోజవర్గం కాంగ్రెస్ టికెట్కు సంబంధించి ఆ పార్టీ సీనియర్ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) పలు సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర రచ్చకు దారి తీసింది. జూబ్లీహిల్స్లో నామినేషన్ వేసేందుకు అంజన్ సిద్ధమవడంతో.. పార్టీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది. స్వయంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్.. అంజన్ కుమార్ నివాసానికి వెళ్లి బుజ్జగించారు. దీంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. జూబ్లీహిల్స్ గెలుపు కోసం పని చేస్తానని అంజన్ ప్రకటించారు. అంజన్ కుమార్కు భవిష్యత్తులో సముచిత గౌరవం ఇస్తానని ఇన్చార్జ్ మీనాక్షి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ చర్యలతో మనస్తాపం చెందినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సీనియర్నని.. తానెప్పుడు ఎప్పుడూ ఓడిపోలేదని.. అందరూ కలిసి ఓడగొట్టారని వ్యాఖ్యలు చేశారు. ‘కష్టకాలంలో నుంచి ఉన్న నన్ను.. ఇప్పుడు పక్కన పెడతారా. నాకు టికెట్ ఇస్తే గెలిచే వాడ్ని. కరోనాతో వెంటిలేటర్పైన వైద్యం చేయించుకున్నాను. కష్ట కాలంలో పార్టీ కోసం పని చేశాను. నర్సరీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టాను. నేను రెండు సార్లు హైదరాబాద్ అధ్యక్షుడిగా పని చేశాను’ అని ఆయన గుర్తుచేశారు.
తనకు అసంతృప్తి ఉందని.. తన బాధనంతా మీనాక్షీ నటరాజన్కు చెప్పుకున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రిని కావలసిన వాడిని కాలేకపోయానన్నారు. రాహుల్ ప్రధాని అయితే కేంద్ర మంత్రిని అవుతానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వమని మీనాక్షికి చెప్పినట్లు తెలిపారు. అవసరం ఉంటే జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తానని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...
ప్రజలు తిరగబడతారనే తెరపైకి రిజర్వేషన్ల అంశం: ఎర్రబెల్లి దయాకర్
Read Latest Telangana News And Telugu News