GHMC Commissioner: అందుకే వార్డులను పెంచాం.. ప్రతీ అభ్యంతరాలను పరిశీలిస్తాం: జీహెచ్ఎంసీ కమిషనర్
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:25 AM
జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై సభ్యులు ఇచ్చే ప్రతీ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ కర్ణన్ తెలిపారు. వార్డుల పేర్లు చేంజ్ చేయాలని ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 16: జీహెచ్ఎంసీ 650 నుంచి 2060 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించిందని... ప్రస్తుత జీహెచ్ఎంసీ దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న కార్పొరేషన్గా మారిందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ (GHMC Commissioner తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, జీహెచ్ఎంసీ అధికారులు ఎక్సర్సైజ్ చేసి వార్డుల విభజన చేశారని చెప్పారు. గతంలో ఔటర్ పరిధిలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ ఇలా నాలుగు రకాల పాలన ఉండేదని.. ఇప్పుడు ఒకటే జీహెచ్ఎంసీగా మారిందని చెప్పుకొచ్చారు. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో కలిపిన తర్వాత జీహెచ్ఎంసీ వార్డుల విభజన జరిగిందని వివరించారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన ప్రక్రియ డిసెంబర్ చివరికి పూర్తి చేస్తే జనగణనకు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు.
సభ్యులు ఇచ్చే ప్రతీ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లిఖిత పూర్వకంగా ఇచ్చే అభ్యంతరాలు ఇవ్వడానికి రేపు చివరి రోజన్నారు. నాచురల్ బౌండరీస్ అయిన నాలా, రోడ్లు, రైల్వే లైన్లను ప్రతిపాదకగా తీసుకుని వార్డుల విభజన చేశామని తెలిపారు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వార్డులను ఒకే నియోజకవర్గానికి తీసుకొచ్చేలా చేశామన్నారు. తెల్లాపూర్లో 23 వేల జనాభా ఉందని.. కానీ రానున్న ఐదేళ్లలో 4 లక్షలకుపైగా జనాభా రానుందని అన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్లు వస్తున్నాయని.. అందుకే అక్కడ వార్డులను పెంచామని పేర్కొన్నారు.
వార్డుల పేర్లు చేంజ్ చేయాలని ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయన్నారు. కొన్ని ఏరియాల్లో హద్దులపై అభ్యంతరాలు వచ్చాయన్నారు. జోన్ల విభజన పూర్తి అవ్వలేదని... ప్రస్తుతం తాత్కాలికంగా సమీప మున్సిపాలిటీలను వివిధ జోన్లలో కలిపామన్నారు. ప్రతీ అభ్యంతరాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని వార్డుల్లో తక్కువ జనాభా ఉన్నా.. భవిష్యత్లో జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ ఎమ్మెల్యేలను కూడా ఈసారి కౌన్సిల్ మీటింగ్కు ఆహ్వానించామని తెలిపారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తేదీలో మార్పు..
దారుణం.. కన్న బిడ్డను బిల్డింగ్ పై నుంచి పడేసిన తల్లి
Read Latest Telangana News And Telugu News