Share News

Banakacherla Project: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:51 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్లపై ముందుకు వెళ్తోంది. అలాంటి వేళ తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు.

Banakacherla Project: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ
BRS MLA Harish Rao

హైదరాబాద్, జూన్ 15: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాంటి వేళ.. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం లేఖ రాశారు. గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కారణంగా గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఏంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్ట్ డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్ సమర్పించడం.. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఆ లేఖలో స్పష్టం చేశారు.


ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రం ఆమోదించే లోపే.. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా.. ఏపీ ఏకపక్షంగా ముందుకు వెళ్లుతుండడం అన్యాయమన్నారు. అయితే రెండు రోజుల క్రితం ఇదే అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆ లేఖలో వ్యతిరేకించడం పట్ల మంత్రి ఉత్తమ్‌ను హరీశ్ రావు పొగడ్తలతో ముంచెత్తారు.


ఏపీ తీసుకుంటున్న చర్యలు.. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతోపాటు నది జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘిస్తుందని.. దీనిపై వెంటనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రాన్ని కోరాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని.. అలాగే రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ మీకు తోడుగా నిలుస్తుందని ఆ లేఖలో హరీశ్ రావు స్పష్టం చేశారు.


మరోవైపు బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఏపీ నిర్మిస్తుండం.. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడంతో శనివారం హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇంకోవైపు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాజెక్టల నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ క్రమంలో వాటి గురించి ఆయన స్వయంగా కేంద్రం వద్దకు వెళ్లి చర్చిస్తున్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రాజెక్టల నిర్మాణాలకు అనుమతి కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బనకచర్ల వల్ల గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం

మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

For Telangana News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 06:38 PM