Share News

Hyderabad Police: రూ.69 లక్షల విలువైన కొకైన్‌ సీజ్‌

ABN , Publish Date - Jul 24 , 2025 | 02:33 AM

ఆఫ్రికా దేశాల నుంచి సముద్ర మార్గంలో ముంబైకి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే ముఠా ఆటను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ వింగ్‌(హెచ్‌-న్యూ) పోలీసులు కట్టించారు.

Hyderabad Police: రూ.69 లక్షల విలువైన కొకైన్‌ సీజ్‌

  • స్థానిక పెడ్లర్‌..నలుగురు ముంబై స్మగ్లర్ల అరెస్టు

  • నగరంలో అక్రమంగా 4వేలమంది విదేశీయులు

  • వీరిలో 844 మంది నైజీరియన్లు

హైదరాబాద్‌ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఆఫ్రికా దేశాల నుంచి సముద్ర మార్గంలో ముంబైకి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే ముఠా ఆటను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ వింగ్‌(హెచ్‌-న్యూ) పోలీసులు కట్టించారు. లోకల్‌ పెడ్లర్‌, ముంబైకి చెందిన నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి, రూ.69 లక్షల విలువైన 276 గ్రాముల కొకైన్‌ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వివరాలను వెల్లడించారు. నగరంలో కొకైన్‌ విక్రయాలపై హెచ్‌-న్యూ నిఘా పెట్టింది. ఈ క్రమంలో రవికుమార్‌ వర్మ, సచిన్‌ అనే ఇద్దరు డ్రగ్స్‌ వినియోగదారులను అదుపులోకి తీసుకుని, విచారించగా.. ముంబై డ్రగ్స్‌ ముఠా డొంక కదిలింది. నగరంలోని డ్రగ్స్‌ పెడ్లర్‌ ప్రేమ్‌ ఉపాధ్యాయ్‌కి.. ముంబైకి చెందిన స్మగ్లర్లు ముజఫిర్‌ వాహీద్‌ షేక్‌ అలియాస్‌ ముజఫర్‌, వినోద్‌ కృష్ణలాల్‌ శ్రీవాత్సవ్‌ అలియాస్‌ వినోద్‌, చైతన్య వినాయక్‌ వాగ్‌ అలియాస్‌ చైతన్య, ముస్తాక్‌ ఖాన్‌ అలియాస్‌ ఇమ్రాన్‌తో ఉన్న లింకును హెచ్‌-న్యూ బృందాలు గుర్తించాయి. వీరందరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముజఫర్‌, వినోద్‌కు ముంబైలో ఉండే నైజీరియన్లతో పరిచయం ఏర్పడి.. డ్రగ్స్‌ దందా చేస్తున్నట్లు సీపీ వివరించారు. లోకల్‌ పెడ్లర్‌ ప్రేమ్‌ జేఎ్‌సఆర్‌ సన్‌సిటీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తూ.. డ్రగ్స్‌కు బానిసయ్యాడని, ఆ తర్వాత గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకువచ్చి, నగరంలో విక్రయించడం ప్రారంభించాడని చెప్పారు. ఇతనిపై గతంలో పలు డ్రగ్స్‌ కేసులున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ముంబైలోని డ్రగ్స్‌ మూలాలపై, నైజీరియన్ల దందాపై దృష్టిసారించామని పేర్కొన్నారు. కాగా.. తొలుత పట్టుబడ్డ కస్టమర్లు రవికుమార్‌ వర్మ, సచిన్‌ నెట్‌వర్క్‌ పైనా హెచ్‌-న్యూ బృందాలు దృష్టిసారించాయి.


నైజీరియాకు డిపోర్టేషన్‌: సీపీ

వీసా గడువు ముగిసినా దేశంలోనే తిష్టవేసి, నేరాలకు పాల్పడుతున్న నైజీరియా దేశస్థులను డిపోర్టేషన్‌ ప్రక్రియ ద్వారా వెనక్కి పంపాలని నిర్ణయించినట్లు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. డ్రగ్స్‌ దందాలో ఉన్న నైజీరియన్లను హెచ్‌-న్యూ ద్వారా వెనక్కి పంపుతామని చెప్పారు. ఇటీవల హెచ్‌-న్యూ అరెస్టు చేసిన నైజీరియన్లు అఫుల్‌ క్లెమెంట్‌ అలియాస్‌ అఫుల్‌ డేవిడ్‌, లాజరస్‌ చిన్‌వెన్‌మేరీ ఫేవర్‌ను వవిచారించిన క్రమంలో.. వారు గతంలో ఛత్తీ్‌సగఢ్‌లో అరెస్టై.. జైలుకు వెళ్లొచ్చినట్లు తేలింది. దీంతో వారిని డిపోర్ట్‌ చేయాలని నిర్ణయించినట్లు సీవీ ఆనంద్‌ తెలిపారు. కాగా.. నగరంలో 4,375 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిలో 844 మంది నైజీరియన్లని సీపీ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 02:33 AM