Share News

Medical Tourism: హైదరాబాద్‌.. వైద్య రాజధాని!

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:16 AM

ప్రపంచానికి హైదరాబాద్‌ వైద్య రాజధానిగా మారు తోంది. ఏటా వేలాది మంది విదేశీయులు హైదారా బాద్‌కు వచ్చి చికిత్సలు పొందుతున్నారు. హైదరాబా ద్‌లోని ఆసుపత్రుల్లో ఉన్న వైద్య నిపుణులు ఎంతో కఠినమైన, సున్నితమైన శస్త్ర చికిత్సలు చేసి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.

Medical Tourism: హైదరాబాద్‌.. వైద్య రాజధాని!

చికిత్స కోసం నగరానికి ఏటా వేలాది మంది విదేశీయులు.. అత్యంత క్లిష్టమైన వైద్య సమస్యలకూ పరిష్కారం

  • నగరంలో నిష్ణాతులైన వైద్యులు, సాంకేతిక సదుపాయాలు

  • విదేశాలతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ..సక్సెస్‌ రేటు ఎక్కువ

  • కీళ్ల మార్పిడి, వెన్నెముక ఆపరేషన్లకు ఎక్కువ మంది రాక

  • కఠినమైన వీసా నిబంధనలతో కొంతమంది చికిత్సకు దూరం

  • వీసా రూల్స్‌ను సులభతరం చేయాలంటున్న ఆస్పత్రులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రపంచానికి హైదరాబాద్‌ వైద్య రాజధానిగా మారు తోంది. ఏటా వేలాది మంది విదేశీయులు హైదారా బాద్‌కు వచ్చి చికిత్సలు పొందుతున్నారు. హైదరాబా ద్‌లోని ఆసుపత్రుల్లో ఉన్న వైద్య నిపుణులు ఎంతో కఠినమైన, సున్నితమైన శస్త్ర చికిత్సలు చేసి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ఒకప్పుడు దేశంలో ప్రముఖులు ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తే అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లేవారు. అలాం టిది అక్కడి వారే మొండిరోగాలకు చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తున్నారంటే వైద్యపరంగా నగరం ఎంత ప్రముఖ స్థానం సంపాదించిందో అర్థం చేసు కోవచ్చు. నగరంలోని వైద్య సదుపాయాలు, స్పెషలి స్టు వైద్యులు, అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం, అక్కడితో పోలిస్తే చికిత్సకు తక్కువ వ్యయం కావడం విదేశీయులను ఆకర్షిస్తున్నాయి. అయితే విదేశీ రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందడానికి వీసా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వీసా నిబంధనలను సడలించి సులభతరం చేస్తే విదేశాల నుంచి వచ్చే రోగుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ‘హీల్‌ ఇన్‌ ఇండియా’ పేరిట మెడికల్‌ ఈ-వీసాలను ప్రారంభించింది. విదేశీయులు ఎక్కువగా వెన్నెముక శస్త్రచికిత్స, కీళ్ల మార్పిడి, గుండె, ఎముక, కంటి, న్యూరో, మూత్రపిండాలు, కాలేయ మార్పిడి చికిత్సల కోసం వస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ శస్త్ర చికిత్సల కోసం విదేశాల్లో కనీసం ఆరు నెలల పాటు వెయిటింగ్‌ లిస్టు ఉంటుందని తెలిపారు. మరోవైపు కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా విదేశీ రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఆస్పత్రిలో ఇంటర్నేషనల్‌ పేషంట్‌ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాయి.


ఒక్కో ఆస్పత్రిలో కనీసం 2వేల మంది

విదేశాల్లో వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసుకుంటే ఎంత లేదన్న రూ.40 లక్షలు అవుతుంది. హైదరాబాద్‌లో కేవలం రూ.2లక్షలతో పూర్తి చేయగలమని వైద్యులు తెలిపారు. కీళ్ల మార్పిడికి విదేశాల్లో రూ.15లక్షలు ఖర్చు అవుతుంటే ఇక్కడ లక్షన్నర నుంచి రెండు లక్షలకు మించి ఉండదన్నారు. విదేశాల్లో బైపాస్‌ సర్జరీకి రూ.15లక్షలకు మించి వ్యయం అవుతుందని, ఇక్కడైతే రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల్లో పూర్తవుతుందని వైద్యులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల్లో సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ‘‘క్లిష్టమైన వ్యాధులకు హైదరాబాద్‌లో చికిత్సలు చేసి నయం చేసిన కేసులు అనేకం ఉన్నాయి. ఇక్కడి వైద్యులు రోగులతో ఎక్కువ సమయం గడుపుతారు. దీని వల్ల రోగుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది’’ అని వివరించారు. ఉగాండా, నైజీరియా, టాంజానియా, మెజాంబిక్‌, కెన్యా, దుబాయ్‌, సౌదీ అరేబియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ మాల్దీవుల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్‌కు చికిత్స కోసం వస్తున్నారు. కార్పొరేట్‌, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రుల్లో విదేశీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. ఒక్కొక్క కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఏడాదిలో కనీసం 2వేల మంది విదేశీ రోగులు అడ్మిట్‌ అవుతున్నట్లు అంచనా.


అన్ని ఎంబసీల్లో ఒకే తరహా రూల్స్‌ ఉండాలి

విదేశాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగుల విషయంలో భారతప్రభుత్వం అన్ని దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో ఒకే తరహా నిబంధనలు అమలు చేయాలి. అలా చేయడం వల్ల వీసాలు సులభంగా దొరికి, వైద్యం కోసం భారత్‌కు వచ్చేవారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. దీని వల్ల విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. కొన్ని దేశాల నుంచి హైదారాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వల్ల కూడా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- పీ హరికృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌


వీసాలకు ఇబ్బందులున్నాయి

విదేశాల నుంచి వచ్చే రోగులకు వీసా ఇబ్బందులున్నాయి. జబ్బు పేరుతో నకిలీ రోగులు విదేశాల నుంచి వస్తున్నారని, దీనివల్ల భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన రోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వారి వివరాలను సేకరించి వారి వివరాలను ఫారెన్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసు(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)కు పంపిస్తున్నాం. రోగుల వివరాలను ప్రతి వారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వీసా నిబంధనలు విషయంలో ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ అధికారులను కలిసే ఆలోచన ఉంది.

- భాస్కర్‌రెడ్డి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, స్టార్‌ ఆస్పత్రి


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 03:16 AM