Share News

High Court: నాగారం భూములపై జోక్యం చేసుకోవద్దు

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:09 AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనంబర్లు 181, 182, 194, 195లలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సస్పెన్షన్‌కు గురవుతారని పోలీసులను హైకోర్టు హెచ్చరించింది.

High Court: నాగారం భూములపై జోక్యం చేసుకోవద్దు

  • పిటిషనర్‌కు ఫోన్‌ చేసిన కానిస్టేబుల్‌ను హెచ్చరించిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనంబర్లు 181, 182, 194, 195లలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సస్పెన్షన్‌కు గురవుతారని పోలీసులను హైకోర్టు హెచ్చరించింది. పిటిషనర్‌ను బెదిరించడం, కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తేవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. నాగారం భూములపై విచారణ కమిషన్‌ వేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని పేర్కొంటూ పడమటితండాకు చెందిన వడిత్య రాములు హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. సర్వే నంబర్‌ 194లో తన 10 ఎకరాల భూమిని అక్రమంగా బదలాయించుకున్నారని రాములు ఆరోపించారు. మహేశ్వరం పోలీ్‌సస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ తనకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని.. ఆధార్‌ కార్డు పట్టుకుని పోలీ్‌సస్టేషన్‌కు రావాలని.. లేదా అరెస్ట్‌ చేస్తామంటున్నారని పేర్కొంటూ హైకోర్టులో మరో పిటిషన్‌ వేశారు.


దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. బెదిరించిన కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ను మంగళవారం ధర్మాసనం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో మంగళవారం కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ‘‘రాములుకు ఫోన్‌ చేశారా? ఎవరు చేయమంటే చేశారు? పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని బెదిరించారా?’’ అని కానిస్టేబుల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. విలేజ్‌ హిస్టరీ రికార్డు నమోదులో భాగంగా, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎ్‌సహెచ్‌వో) ఆదేశాల మేరకు ఫోన్‌ చేశానని, విచారణ కమిషన్‌ వేయాలన్న పిటిషన్‌ గురించి ఏమీ మాట్లాడలేదని కానిస్టేబుల్‌ బదులిచ్చారు. మరోసారి బెదిరించినట్లు తెలిస్తే సస్పెన్షన్‌కు ఆదేశిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. ఇది దాదాపు 25 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు సంబంధించిన అంశమని, దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందని.. ఇందులో పోలీసులు తలదూరిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది. మరోసారి పోలీసులు జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది విజయలక్ష్మి కోరగా.. అవసరం లేదని పేర్కొన్న ధర్మాసనం.. విచారణను ముగించింది.


యాంత్రికంగా రిమాండ్‌ విధించొద్దు

  • మేజిస్రేట్‌ కోర్టులకు హైకోర్టు సూచన

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): క్రిమినల్‌ కేసుల్లో నిందితులకు యాంత్రికంగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించరాదని హైకోర్టు... మేజిస్ట్రేట్‌ కోర్టులకు సూచించింది. అరెస్ట్‌ చేసి.. 24 గంటల సమయం దాటిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడంతోపాటు, ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుబట్టింది. మలక్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన ఓ కేసులో తనను మేజిస్ట్రేటు కోర్టు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ నిందితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అరెస్టు చేసి 24 గంటల సమయం ముగిసిన తర్వాత కూడా గంటన్నర ఆలస్యంగా కోర్టులో ప్రవేశపెట్టడంతోపాటు ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులో నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని పశ్నించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం కింది కోర్టు ఆదేశాలను తప్పుపట్టింది. పూచీకత్తులు తీసుకుని నిందితుడిని వదిలేయాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 04:09 AM