Share News

Nagarjuna Sagar: శ్రీశైలం ప్రాజెక్టుకు అదే ఉధృతి

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:32 AM

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం 4.69 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లు ఎత్తి 4.19 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Nagarjuna Sagar: శ్రీశైలం ప్రాజెక్టుకు అదే ఉధృతి

  • 4.69 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

  • సాగర్‌కు వచ్చిన వరద వచ్చినట్టే 26 గేట్ల ద్వారా దిగువకు విడుదల

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం 4.69 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లు ఎత్తి 4.19 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా 61,402 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 2 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో, అంతే ఔట్‌ ఫ్లో ఉంది. భీమా నదిపై ఉన్న సన్నతి బ్యారేజీ నుంచి 2.20 లక్షల క్యూసెక్కులను జూరాలకు విడుదల చేశారు. ప్రస్తుతం జూరాలకు 4.18 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 44 గేట్లను ఎత్తి 4.16 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.


తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 54 వేల క్యూసెక్కులను శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు నుంచి 4.09 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా శనివారం సాయంత్రం 584.50 అడుగులు ఉంది. ఇదిలా ఉండగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 41.8 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారం సాయంత్రం 6 గంటలకు 36.2 అడుగులకు తగ్గింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి 5.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 85 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 6.30 మీటర్లు ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యాంకు శనివారం నీటిని విడుదల చేశారు.


రేపు మరో అల్పపీడనం

విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): బెంగాల్‌, బంగ్లాదేశ్‌ పరిసరాల్లో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం నాటికి జార్ఖండ్‌ వైపు పయనించి బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మన రాష్ట్రంపై ఎటువంటి ప్రభావమూ చూపదని పేర్కొంది. అలాగే, ఈనెల 25న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దాని ప్రభావంతో 26 నుంచి ఉత్తర కోస్తాలో ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 01:32 AM