MK Stalin: నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:03 PM
కేంద్ర రాష్ట్ర సంబంధాలపై తొలి జాతీయ సదస్సును తమిళనాడులో తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని స్టాలిన్ అన్నారు కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా జీఎస్టీ ఆదాయం అందిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని చెప్పారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి కేంద్రంపై, బీజేపీపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పాలనను చిక్కుల్లోకి నెడుతోందని, నిధుల్లో న్యాయబద్ధమైన వాటాను ఇచ్చేందుకు నిరాకరిస్తోందని ఆరోపించారు. తమిళనాడులోని రాజకీయాలన్నీ సామాజిక న్యాయానికి సంబంధించిన రాజకీయాలని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు అనేక రంగాల్లో ముందుందని చెప్పారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కలైవనర్ అరంగంలో శనివారంనాడు నిర్వహించిన జాతీయ సెమినార్లో స్టాలిన్ మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర సంబంధాలపై తొలి జాతీయ సదస్సును తమిళనాడులో తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని స్టాలిన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా జీఎస్టీ ఆదాయం అందిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం సంకుచిత రాజకీయ ఉద్దేశాలతో తమిళనాడుకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధుల వాటాను ఇచ్చేందుకు నిరాకరిస్తోందని విమర్శించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు బీజేపీ పాలనలో లేకపోవడంతో కేంద్రం పలు సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు.
దశాబ్దాలుగా రిజర్వేషన్ల విధానాన్ని తమిళనాడు అమలు చేస్తోందని, పలు ప్రగతిశీల చట్టాలు, పథకాలు తెచ్చిందని చెప్పారు. ఇందుకు ద్రవిడియన్ ఉద్యమం పునాది వేసిందన్నారు. తమిళనాడు పలు ఆర్థిక ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ 2024-25లో వృద్ధి రేటు రెండంకెల స్థాయికి.. 11.19 శాతానికి చేరుకుందని చెప్పారు. ఇది 14 ఏళ్ల తర్వాత అత్యధిక వృద్ధి రేటని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీ రుద్దడాన్ని తమిళనాడు వ్యతిరేకించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఇదే తరహా హిందీ వ్యతిరేక ఆందోళనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. స్వయం సమృద్ధి రాష్ట్రాలతోనే ఐక్య భారత్ పటిష్టం సాధ్యమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా హక్కుల వంటి ఉన్నత సిద్ధాంతాల కోసం ద్రవిడ నేతలు అవిశ్రాంతంగా పనిచేస్తూ వచ్చారని, అన్నా, కలైంజర్ ఇద్దరూ ప్రతిరంగంలోనూ ప్రజల అభ్యున్నతికి వివిధ కీలక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు.
కశ్మీర్ నుంచి రాష్ట్రప్రతిపత్తిని లాక్కోవడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయని స్టాలిన్ చెప్పారు. సర్కారియా కమిషన్ సైతం అధిక అధికార కేంద్రీకరణ వల్ల కేంద్రంపై ఆగ్రహం పెరుగుగుతుందని, రాష్ట్రాలు నిరాశానిస్పృహలకు లోనవుతాయని చెప్పినట్టు స్టాలిన్ వివరించారు.
ఇవి కూడా చదవండి..
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
ఆ బిల్లు ఓ ప్రహసనం, జేపీసీకి సభ్యుడిని నామినేట్ చేయం.. మమత ఫైర్
For More National News And Telugu News