Harish Rao: తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ గండి
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:00 AM
తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండికొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది: హరీశ్ రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండికొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కృష్ణా జలాలను ఏపీ అడ్డూఅదుపూ లేకుండా తరలించుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఏం చేస్తున్నారని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. ‘మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువనుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? 646 టీఎంసీలు తరలిస్తే ఎందుకు నోరుమెదపడం లేదు?’ అని ఆయన నిలదీశారు.
సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉందని, వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ మాత్రం ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తోందని ఆరోపించారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నిల్వ ఉంచాల్సిన కోటాను ఏపీ తీసుకెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు.