G. Kishan Reddy: ఆర్ఆర్ఆర్కు మోదీ భూమి పూజ!
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:25 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తరభాగం పనులకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ రోడ్డును కేంద్రం సూత్రప్రాయంగా మంజూరు చేసిందని, క్యాబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతోందని చెప్పారు.
క్యాబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతోంది
భూసేకరణకు నిధుల్లేవన్నా.. గడ్కరీకి చెప్పి ఒప్పించాను
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి
కాంగ్రెస్ విఫల గ్యారంటీలను మాపై రుద్దడమేంటి?
తెలంగాణ బాస్ బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉప పార్టీలు
మహిళా దినోత్సవం రోజున అఖిలపక్ష సమావేశమా?
ముందస్తు కార్యక్రమాల వల్లే మేం వెళ్లలేదు: కిషన్రెడ్డి
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తరభాగం పనులకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ రోడ్డును కేంద్రం సూత్రప్రాయంగా మంజూరు చేసిందని, క్యాబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతోందని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఏర్పాటు, క్యాబినెట్ ఆమోదం కోసం ప్రక్రియ ప్రారంభం, ఆర్థిక విభాగానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం అంశాలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఇటీవలే కోరామని తెలిపారు. ఆయన వెంటనే స్పందించి అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం పనులకు రూ.18,750 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారిగా గుర్తించాల్సిందిగా గడ్కరీని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,200 కోట్లతో చేపట్టిన 10 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయిందని, వీటిని పార్లమెంటు సమావేశాల అనంతరం గడ్కరీ ప్రారంభిస్తారని చెప్పారు. ఆర్ఆర్ఆర్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా.. కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించారు. దీనిపై తాను ముఖ్యమంత్రికి లేఖ రాస్తే.. జవాబు రాలేదన్నారు. ‘‘తమ వద్ద అన్ని నిధుల్లేవని, ప్రస్తుతానికి వంద కోట్లు జమ చేస్తామని, భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైన తరువాత పరిస్థితిని బట్టి మిగతా నిధులు జమ చేస్తామని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి నాకు లేఖ రాశారు. సాధారణంగా అయితే వందశాతం నిధులు ఒక రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తేనే కేంద్రం ఆయా ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కేంద్ర మంత్రి గడ్కరీని తాను ఒప్పిస్తే ఆయన అంగీకరించారు. ఇదంతా జరిగింది రేవంత్ సీఎం అయిన కొత్తలో’’ అని కిషన్రెడ్డి వివరించారు.
ఒక్క సీటు కూడా తగ్గదు..
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా తగ్గదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. తమిళనాడు, తెలంగాణ సీఎంలు చేస్తున్న ప్రచారమంతా బోగస్ అన్నారు. ఇక కాంగ్రెస్ చేపట్టాలనుకున్న ప్రాజెక్టులను తమను పూర్తిచేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘సీఎం రేవంత్ ఇచ్చిన హామీలకు అతీ గతీ లేదు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదించి మమ్మల్ని పూర్తిచేయాలని డిమాండ్ చేయడం న్యాయమా?’’ అని కిషన్రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్ర ప్రజలను మీరు మోసం చేస్తూ మాపై రాళ్లు వేస్తారా? మీ చేతగానితనం, తప్పుడు హామీలు, విఫల గ్యారంటీలను మాపై రుద్దితే ఎలా?’’ అని మండిపడ్డారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని కేంద్రమంత్రి ప్రకటించారు. 2026 జనవరి 26న ఆధునికీకరించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కాగా, ‘తెలంగాణ బాస్ బీజేపీ’ అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఉప పార్టీలుగా మారిపోయాయన్నారు.
అఖిలపక్ష సమావేశానికి అందుకే వెళ్లలేదు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే అఖిలపక్ష సమావేశం నిర్వహించడమేంటని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని తమ పార్టీ ఎంపీలంతా వారి నియోజకవర్గాల్లో ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందన్నారు. దాంతో పాటు ముందుగా నిర్ణయించిన అధికార, అనధికార కార్యక్రమాల వల్లే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకాలేకపోతున్నామంటూ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు కిషన్రెడ్డి లేఖ రాశారు. ప్రాధాన్యం కలిగిన ఇలాంటి సమావేశాల్లో కీలకమైన అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కనీస సమయం అవసరమని, కానీ.. తమ పార్టీ ఎంపీలందరికీ ఆలస్యంగా ఈ సమాచారం అందిందని తెలిపారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే కాస్త ముందుగా తెలియజేయాలని లేఖలో కోరారు.
ఒకే దేశం.. ఒకే ఎన్నికపై విస్తృత ప్రచారం
పార్టీ నేతలకు కిషన్రెడ్డి పిలుపు..
దేశం అభివృద్ధి చెందాలంటే ఒకే దేశం-ఒకే ఎన్నిక తప్పనిసరని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. తరచూ ఏదో ఒక ఎన్నికలు జరుగుతుండడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు, ఒకే దేశం-ఒకే ఎన్నికపై పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్తో కలిసి చర్చించారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానంతో కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం విస్తృతంగా సమావేశాలు, సదస్సులు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. పార్టీ కంటే దేశమే ముఖ్యమన్నదే మన అజెండా అని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేశారని.. దానివల్లే 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నామని సునీల్ బన్సల్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..
Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..