Share News

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

ABN , Publish Date - Mar 08 , 2025 | 08:30 PM

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీఎత్తున నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సులను రేవంత్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..
CM Revanth Reddy

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (శనివారం) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి వెళ్లిన సీఎం.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.550 కోట్లతో యూనివర్సిటీ నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీఎత్తున నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సులను రేవంత్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత మహిళా సంఘాల స్టాల్స్‌ను మంత్రులతో కలిసి సందర్శించారు. అక్కడే మహిళా పెట్రోల్ బంకుల నమూనాను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులతో వారి ఉత్పత్తుల గురించి ముచ్చటించారు. వారు తయారు చేసిన రాగి లడ్డూని రేవంత్ రుచి చూసి ప్రశంసించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "వందేళ్ల చరిత్ర కలిగిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ.550 కోట్ల నిధులు కేటాయించాం. అంతర్జాతీయ యూనివర్సిటీలతో విద్యార్థులు పోటీ పడాలి. మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ కృషి చేశారు. రాజకీయాల్లోకి మహిళలు కూడా రావాలి. అవకాశం వస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. గత పదేళ్లపాటు ఆడబిడ్డలకు గ్రహణం పట్టింది. వారి ఆశీర్వాదంతోనే గ్రహణం తొలగిపోయింది. ఇప్పుడు ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడ్డారు. కేసీఆర్‌ పాలన, కాంగ్రెస్‌ పాలనకు ఉన్న తేడాను మహిళలు గమనిస్తున్నారు.


ఇందిరమ్మ రాజ్యం కావాలని మహిళలు కోరుకున్నారు. 65 లక్షల మంది ఆడవారు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌ నిర్వహణను స్వయం సహాయ సంఘాలకు అప్పగించాం. పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌ కుట్టే బాధ్యతా వారికే అప్పగించాం. ఆడబిడ్డలు తలచుకుంటే వన్‌ ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధన కష్టం కాదు. మహిళా సంఘాలు కార్పొరేట్‌ కంపెనీలతో పోటీపడేలా చేస్తాం. ప్రతి జిల్లాలో ఇందిరా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం. సోలార్‌ ఉత్పత్తిలో అదానీ, అంబానీలతో పోటీ పడేలా చేస్తాం. తెలంగాణ ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులకు మహిళలు యజమానులు.


మహిళలకు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఉండాలని సోనియా కృషి చేశారు. మహిళలకు అండగా ఉన్నది ఇందిరమ్మ రాజ్యమే. ప్రతి మండలంలో రైస్‌ మిల్లులు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నాం. మహిళా సంఘాల వ్యాపారాల్లో పన్ను మినహాయింపులు ఇస్తాం. టన్నెల్‌ కూలితే, పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు పైశాచికానందం పొందుతున్నారు. వారి పైశాచికానందం కోసం నన్ను తిడుతున్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే ప్రయత్నం చేయాలి. మంచి సూచనలు ఇవ్వాలి. అంతేకానీ దురుద్దేశంతో విమర్శలు చేస్తే సరికాదు. ఆడబిడ్డలు అన్నగా మాట ఇస్తున్నా. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తా. కేసీఆర్‌ మొదటి టర్మ్‌లో అసలు మహిళా మంత్రే లేరు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..

Updated Date - Mar 08 , 2025 | 08:30 PM