Central Budget: అప్రజాస్వామికంగా కేంద్ర బడ్జెట్
ABN , Publish Date - Feb 04 , 2025 | 03:49 AM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అప్రజాస్వామికంగా ఉందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని మండిపడ్డారు.
బీజేపీయేతర రాష్ట్రాలపై ఆర్థిక వివక్ష
‘విభజన’ హామీలను మరిచిన కేంద్రం
నిరసనల్లో కాంగ్రెస్ నేతల మండిపాటు
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అప్రజాస్వామికంగా ఉందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని మండిపడ్డారు. టీపీసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో సోమవారం నిరసన ధర్నాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖమ్మంలో నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంబేడ్కర్ విగ్రహం ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో తుమ్మల మాట్లాడుతూ విభజన చట్టం హామీలను కేంద్రం విస్మరించిందని దుయ్యబట్టారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై నోరు మెదపలేదని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఏడాదిగా సీఎం రేవంత్రెడ్డి నుంచి మంత్రుల వరకు పలు సమస్యలపై 30సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినా.. స్పందన లేదన్నారు.
మహబూబ్నగర్లో జరిగిన ధర్నాలో దేవరకద్ర, మహబూబ్నగ్ ఎమ్మెల్యేలు జి మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివా్సరెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయించి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గద్వాలలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితోపాటు నేతలు నిరసన చేపట్టారు. జగిత్యాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News