Bonalu: బోనాల జాతరకు నగరం సిద్ధం.. నేడు గోల్కొండలో ప్రారంభం
ABN , Publish Date - Jun 26 , 2025 | 08:50 AM
బోనాల జాతరకు నగరం సిద్ధమైంది. నెల రోజుల పాటు సాగే ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పసుపు, కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి.
- జగదాంబిక అమ్మవారికి తొలిబోనం
- ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు
- హాజరు కానున్న మంత్రులు
హైదరాబాద్: బోనాల జాతరకు నగరం సిద్ధమైంది. నెల రోజుల పాటు సాగే ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పసుపు, కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబికా అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. చివరి బోనంతో కోటలోనే ఉత్సవాలు ముగుస్తాయి. నెల రోజుల పాటు ప్రతీ గురు, ఆదివారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు.
తొలిబోనం విశిష్టత
లంగర్హౌజ్ వాసుల చేతుల మీదుగానే బోనాలు ప్రారంభించడం శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. లంగర్హౌజ్ను గతంలో లంగర్ఖానా అని పిలిచేవారు. లంగర్ అనగా వంట. ఖానా అనగా గది. నాడు వంట గదులు ఉండేవి కావు. ఆహార ధాన్యాలను ఇక్కడి భాండాగారాల్లో దాచి రాజులకు, సైనికులకు ఆహారాన్ని లంగర్హౌజ్లోనే వండి పంపించేవారు. అమ్మవారికినైవేద్యాన్ని కూడా ఇక్కడి నుంచే పంపించడంతో ఆ ఆనవాయితీ కొనసాగుతోంది.
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు
ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించి లంగర్హౌజ్లో ఊరేగింపును ప్రారంభిస్తారు. చోటాబజార్లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు చేసి అక్కడి నుంచి బోనాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించడంతో మొదటి పూజ ముగుస్తుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యే మహ్మద్ కౌసర్ మొహియుద్దీన్, మేయర్ విజయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొనున్నారు.

సామూహిక ఊరేగింపు
అమ్మవారిని నగలతో అలంకరించి, తొలిబోనం సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. జూలై 6న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి, మీరాలంమండీ అమ్మవారు, లాల్దర్వాజ అమ్మవార్లతో పాటు పలు ఆలయాల నుంచి దాదాపు 100కు పైగా తొట్టెలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. వాటిని జూలై 10న లంగర్హౌజ్కు తీసుకురానున్నారు. ఇక్కడి నుంచి సామూహిక ఊరేగింపుగా గోల్కొండ కోటపైకి సాగనుంది.
ఏర్పాట్లు పూర్తి చేశాం
బోనాల జాతరకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాం. లంగర్హౌజ్ నుంచి గోల్కొండ కోటపై గల అమ్మవారి ఆలయం వరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం.
- కె.చంటిబాబు, గోల్కొండ జగదాంబిక మహాకాళి ఆలయ చైర్మన్
గోల్కొండ కోట మెట్లపూజ
గోల్కొండ బోనాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గోల్కొండ, లంగర్హౌజ్, కార్వాన్ ప్రాంత ప్రజలు బుధవారం కోటలో మెట్ల పూజ నిర్వహించారు. కోటకు గల 385 మెట్లకు పసుపు, కుంకుమ పెట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజను నిర్వహించారు. ఉత్సవం ప్రారంభానికి ముందు మెట్ల పూజ ఆనవాయితీగా వస్తోంది. కోట పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు
Read Latest Telangana News and National News