Share News

Governor Jishnu Dev Varma: ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తారా?

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:51 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లను కల్పించేందుకు చేసిన ఆర్డినెన్స్‌ దస్త్రం ఇంకా రాజ్‌భవన్‌లోనే ఉంది. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు.

Governor Jishnu Dev Varma: ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తారా?

  • గవర్నర్‌ నిర్ణయం కోసం నిరీక్షణ

  • స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారుపై రేపటితో ముగియనున్న హైకోర్టు గడువు

  • గవర్నర్‌ ఏమీ తేల్చకపోతే.. క్యాబినెట్‌లో చర్చించి బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం?

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లను కల్పించేందుకు చేసిన ఆర్డినెన్స్‌ దస్త్రం ఇంకా రాజ్‌భవన్‌లోనే ఉంది. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. మరోవైపు ఈ నెల 25కల్లా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని, సెప్టెంబరు 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లను కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం- 2018లోని సెక్షన్‌ 285(ఏ) సవరణ కోసం గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్‌ దస్త్రం ముందుకు కదలకపోవడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలంటూ పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వారు పోలింగ్‌ బూత్‌ల వారీగా వివరాలను సిద్ధం చేస్తున్నారు. కానీ, ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ స్పందించకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారంతో రిజర్వేషన్ల ఖరారుకు గడువు ముగియనున్న నేపథ్యంలో.. మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.


శుక్రవారం సాయంత్రం క్యాబినెట్‌ భేటీ జరగనుంది. ఆలోపు ఆర్డినెన్స్‌ వస్తే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టనున్నారు. మంత్రివర్గ సమావేశంలోపు ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించకపోతే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42ు రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై భేటీలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లను పెంచుకునేందుకూ అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌285(ఏ)ను సవరించాలని గత క్యాబినెట్‌లో నిర్ణయించడంతో పాటు రిజర్వేషన్లకు ఇప్పటివరకు ఉన్న గరిష్ఠ పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ సెక్షన్‌ 285(ఏ)లో ఉన్న నిబంధనను సవరించనున్నారు. దీనికి గవర్నర్‌ ఆమోదం ఉండాలి. సవరణకు గల కారణాలన్నింటినీ వివరిస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించిన సర్కారు.. గవర్నర్‌కు పంపింది. ఆయన ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 01:51 AM