Share News

Cable Cuts Disrupt Internet: ఎర్ర సముద్రంలో కేబుల్ కట్..భారత్, ఆసియా, పశ్చిమ ఆసియాలో ఇంటర్నెట్ సమస్యలు

ABN , Publish Date - Sep 08 , 2025 | 07:58 AM

ఎర్ర సముద్రం అడుగున ఇంటర్నెట్ కేబుల్స్ కట్ కావడం వల్ల భారత్, ఆసియా సహా ఇతర దేశాలలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి రాగా, ఇది ఉద్దేశపూర్వక చర్య అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Cable Cuts Disrupt Internet: ఎర్ర సముద్రంలో కేబుల్ కట్..భారత్, ఆసియా, పశ్చిమ ఆసియాలో ఇంటర్నెట్ సమస్యలు
red sea Cable Cuts Disrupt Internet

ఎర్ర సముద్రంలో (Red Sea) జరిగిన అండర్‌సీ కేబుల్ కట్‌ల (Cable Cuts) కారణంగా భారతదేశంతో సహా (India internet outage) ఆసియా, పశ్చిమ ఆసియా దేశాలలో ఇంటర్నెట్ సేవలు అంతరాయం కలిగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. కానీ, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ కేబుల్‌లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హౌతీలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ, గతంలో ఇలాంటి ఘటనలకు తాము బాధ్యులం కాదని హౌతీలు తిరస్కరించారు.


ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం

ఇంటర్నెట్ సేవలను పర్యవేక్షించే సంస్థ నెట్‌బ్లాక్స్ ప్రకారం, ఎర్ర సముద్రంలో జరిగిన కేబుల్ కట్‌ల వల్ల భారతదేశం, పాకిస్తాన్‌తో సహా పలు దేశాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతింది. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఎస్‌ఎండబ్ల్యూ4, ఐఎంఈడబ్ల్యూ కేబుల్ సిస్టమ్‌లలో సమస్యలు తలెత్తాయని నెట్‌బ్లాక్స్ తెలిపింది. ఎస్‌ఎండబ్ల్యూ4 కేబుల్‌ను భారతదేశానికి చెందిన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తుంది. ఐఎంఈడబ్ల్యూ కేబుల్‌ను ఆల్కాటెల్-లూసెంట్ నేతృత్వంలోని ఓ కన్సార్టియం చేపడుతుంది. ఈ రెండు సంస్థలు ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.


ఈ ప్రాంతాల్లో కూడా..

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధికారులు ఈ అంతరాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ యూఏఈ యాజమాన్యంలోని డూ, ఎటిసలాట్ నెట్‌వర్క్‌లలో ఇంటర్నెట్ స్లోగా ఉందని ఫిర్యాదు చేశారు. మైక్రోసాఫ్ట్ కూడా తన స్టేటస్ వెబ్‌సైట్‌లో పశ్చిమ ఆసియాలో ఇంటర్నెట్ వేగం తగ్గవచ్చని పేర్కొంది. ఎర్ర సముద్రంలోని నెట్ కేబుళ్లలో సమస్య తలెత్తినప్పటికీ, దీనికి లింక్ లేని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.


హౌతీ తిరుగుబాటు నేపథ్యం

ఇది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న సమయంలో జరిగాయని అంటున్నారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ హౌతీ నాయకులపై వైమానిక దాడులు చేసింది. ఇందులో పలువురు కీలక నేతలు మరణించారు. 2024 ప్రారంభంలో యెమెన్‌లోని ప్రవాస ప్రభుత్వం హౌతీలు ఎర్ర సముద్రంలో అండర్‌సీ నెట్ కేబుళ్లపై దాడి చేయాలని ప్లాన్ వేస్తున్నారని ఆరోపించింది. ఆ సమయంలో కొన్ని కేబుల్‌లు దెబ్బతిన్నప్పటికీ, హౌతీలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆదివారం హౌతీల అల్-మసీరా న్యూస్ ఛానల్ ఈ తాజా కేబుల్ కట్‌లు ఉన్నట్లు తెలిపింది.


నెట్ సేవలపై ప్రభావం

ఈ నెట్ కేబుళ్ల సమస్య ఆసియా, పశ్చిమ ఆసియా దేశాలలో ఇంటర్నెట్ సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే భారతదేశం, పాకిస్తాన్ వంటి దేశాలలో ఇంటర్నెట్ వినియోగదారులు నెమ్మదిగా కనెక్షన్‌లను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు ఎంత త్వరగా పరిష్కారమవుతాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే సంబంధిత సంస్థల నుంచి ఇంకా అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2025 | 01:08 PM