SuryaKumar Yadav: తక్కువ మార్కులు వచ్చాయని చదువు మానేస్తామా?: సూర్య
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:42 PM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఎట్టకేలకు తన ఫామ్పై స్పందించాడు. సెలక్టర్లు తనపై నమ్మకం ఉంచి జట్టులో చోటిచ్చారని.. త్వరలోనే ఫామ్ అందుకుంటానని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా తుది జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీ20 ఫార్మాట్లో టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. కానీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఫామ్ లేమి వల్లే టీ20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ముందు జట్టు సారథిని తొలగిస్తే పద్ధతిగా ఉండదన్న ఉద్దేశంతోనే సూర్యకు ఆఖరి అవకాశంగా జట్టులో చోటు కల్పించారు. అయితే తన పేలవ ప్రదర్శనపై సూర్య(SuryaKumar Yadav) స్పందించాడు.
‘క్రీడలు మనకు చాలా నేర్పుతాయి. ప్రతి ఆటగాడి కెరీర్లో తాము ఇంకా నేర్చుకోవాల్సిన దశలో ఉన్నామని అనిపించే సమయం ఒకటి వస్తుంది. ప్రస్తుతం నేను అలాంటి ‘లెర్నింగ్ ఫేజ్’లోనే ఉన్నాను. అయితే నా జట్టులోని 14 మంది సహచర ఆటగాళ్లు నా బాధ్యతను పంచుకుంటున్నారు. నేను మళ్లీ మునపటిలా ఫామ్ అందుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.
పరీక్షల్లో మనకు తక్కువ మార్కులు వచ్చాయని చదువు మానేయం కదా? ఎక్కువ మార్కులు సాధించేందుకు మరింత కష్టపడతాం. నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నా. నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. కఠినంగా శ్రమిస్తున్నాను. త్వరలోనే పరుగుల వేట మొదలవుతుందనే నమ్మకం నాకుంది’ అని సూర్య ధీమా వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి:
చతికిలపడ్డ టీమిండియా.. పాకిస్తాన్ ఘన విజయం
మా కల చెదిరిపోయింది.. బెన్ స్టోక్స్ ఎమోషనల్ వ్యాఖ్యలు